టిక్టాక్ స్టార్, హర్యానా బీజేపీ నేత సోనాలి ఫోగట్ తొలుత భావించినట్లు గోవాలో సహజ మరణం పొందలేదని, హత్యకు గురైనట్లు భావిస్తున్నారు. మృతదేహా పరీక్షలో గాయాలున్నట్లు గుర్తించడంతో సహజ మరణంగా కేసు నమోదు చేసిన గోవా పోలీసులు ఇప్పుడు హత్యా కేసుగా నమోదు చేశారు.
ఫోగట్ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సోనాలీ మృతదేహానికి గురువారం గోవా మెడికల్ కాలేజీలో వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. ఈ రిపోస్టులో ఆమె శరీరంపై అనేక మొద్దుబారిన గాయాలు ఉన్నట్లు వెల్లడైంది. దీంతో సోనాలితో పనిచేసే ఇద్దరు సహచరులపై గోవా పోలీసులు హత్యానేరం అభియోగాలు మోపారు.
హర్యానాలోని హిసార్కు చెందిన టిక్టాక్ స్టార్, బీజేపీ నాయకురాలు సోనాలి ఫోగట్ (42) ఆగస్టు 23న గోవాలో హఠాన్మరణం చెందింది. ఉదయం 9 గంటల సమయంలో గుండెపోటుకు గురైన సోనాలి ఆసుపత్రికి తరలించేలోపు తుదిశ్వాస విడిచారు. అయితే ఆమె మరణం వెనుక హత్య కుట్ర దాగి ఉందని సోనాలి కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.
సోనాలి పీఏ సుధీర్ సంగ్వాన్తోపాటు ఆమెతో సన్నిహితంగా ఉండే సుఖ్వింధర్ అనే ఇద్దరు వ్యక్తులే హత్య చేసి ఉంటారని ఆరోపిస్తూ ఆమె సోదరుడు రింకూ ధాకా బుధవారం అంజునా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ అత్యున్నత దర్యాప్తునకు ఆదేశించారు. గోవా డీజీపీ స్వయంగా ఈ కేసును పర్యవేక్షిస్తున్నారు.
ఆమెపై ఏళ్ల తరబడి అత్యాచారం జరుగుతోందని, ఆస్తి కోసమే ఆమెను హత్య చేసి ఉంటారని ఆమె సోదరుడు ఆరోపించాడు. సోనాల్ ఫోగట్ పీఏ సుధీర్ సంగ్వాన్, అతని స్నేహితుడు సుఖ్విందర్లు కలిసి ఆమెకు గత మూడేళ్లుగా మత్తు మందు కలిపిన ఆహారం ఇచ్చేవాళ్లని, ఆమెపై హిస్సార్లోని ఇంట్లో అఘాయిత్యానికి పాల్పడి వీడియో తీసేవాళ్లని, వాటి ఆధారంగా ఆమెను బ్లాక్ మెయిల్ చేసి లోబర్చుకున్నారని రింకు చెబుతున్నాడు.
సినీ, రాజకీయ జీవితాన్ని నాశనం చేస్తానని సోనాలిని వాళ్లిద్దరూ బెదిరించేవారని, డబ్బు.. ఇతర సౌకర్యాలను అనుభవించేవాళ్లని, పరువుపోతుందనే భయంతోనే ఆమె ఇంతకాలం మౌనంగా ఉండిపోయిందని రింకు పోలీసులకు తెలిపాడు.
గోవాలో షూటింగ్ పేరుతో సోనాలి ఫోగట్ను తీసుకెళ్లారని, తీరా అక్కడికెళ్లాక షూటింగ్ లేదని చెప్పారని, ఈ క్రమంలోనే భోజనం చేశాక ఏదోలా ఉందని, అక్కడేదో జరుగుతోందని సోనాలి తమ కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా తెలియజేసిందని, ఫోన్ ట్రేస్ చేసే ఛాన్స్ ఉండడంతో వాట్సాప్ కాల్ మాట్లాడాలని ప్రయత్నించిందని రింకూ చెప్తున్నాడు.
సోనాలి ఇంటి తాళాల దగ్గరి నుంచి ఫోన్, బ్యాంక్ కార్డులు, ఆర్థిక లావాదేవీలన్నీ సుధీర్ దగ్గరే ఉండేవని, సోనాలి మరణం వార్త తెలిశాక ఆమె ఫోన్లతో పాటు తన ఫోన్లను సుధీర్ స్విచ్ఛాప్ చేసుకోవడం అనుమానాలకు తావిస్తోందని రింకు పోలీసులు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.