ఆంధ్ర ప్రదేశ్ లో ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. పర్యావరణ పరిరక్షణ, ఆర్థిక పురోగతి నాణేనికి రెండువైపులని ఈ సందర్భంగా జగన్ తెలిపారు.
శుక్రవారం విశాఖపట్నం ఏయూ కన్వెన్షన్ సెంటర్లో ‘పార్లే ఫర్ ది ఓషన్స్’ సంస్థతో ఎంఓయూ సందర్భంగా ముఖ్యమంత్రి ఈ కీలకమైన ప్రకటన చేశారు. ప్లాస్టిక్ ఫ్లెక్సీలు వినియోగించరాదని స్పష్టంచేసిన జగన్ ప్లెక్సీలు ఏర్పాటు చేయాలంటే బట్టతో చేసినవే ఉండాలని సూచించారు. విశాఖ నుంచి ఈ ప్లాస్టీక్ ఫ్లెక్సీల నిషేదం అమలు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
శుక్రవారం ఉదయం కోస్టల్ బ్యాటరీ నుంచి భీమిలి వరకూ ప్లాస్టిక్ వ్యర్థాలను క్లీన్ చేశారు వలంటీర్లు. ఈ సందర్భాన్ని ప్రస్తావిస్తూ ఇవాళ విశాఖలో ప్రపంచంలోనే అతిపెద్ద బీచ్ క్లీనింగ్ కార్యక్రమం జరిగిందని సీఎం జగన్ మెచ్చుకున్నారు.
దాదాపు 76 టన్నుల ప్లాస్టిక్ను సముద్రం తీరం నుంచి తొలగించారు. భూమిపై 70 శాతం ఆక్సిజన్ సముద్రం నుంచే వస్తోంది. అందుకే సముద్రాన్ని కాపాడుకోవాలి. అలాగే ఏపీ తీరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత పౌరులందరిదీ అని 2027 నాటికి ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ మన సంకల్పంగా ప్లాస్టిక్ ఫ్లెక్సీలను నిషేధించాలని జగన్ పిలుపునిచ్చారు.
పార్లే సంస్థ సముద్రం నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలను బయటకు తీస్తుంది. రీసైకిల్ చేసి పలు ఉత్పత్తులు తయారు చేస్తుంది. అంతేకాదు.. పార్లే ఫ్యూచర్ ఇనిస్టిట్యూట్ను ఏపీలో ఏర్పాటు చేయనున్నారు అని సీఎం జగన్ వెల్లడించారు.
ఇక పర్యావరణాన్ని రక్షిస్తూనే.. ఆర్థిక పురోగతి సాధించాలని చెప్పారు. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందని భరోసా ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నాలుగు వేల చెత్త సేకరణ వాహనాలను ఏర్పాటు చేశామని సీఎం జగన్ తెలిపారు. ప్లాస్టిక్ నుంచి రీసైక్లింగ్ నుంచి తయారు చేసిన షూస్, కళ్ల జోడులను స్వయంగా ఆయన చూపించారు.