జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్కు ఎదురుదెబ్బ తగిలింది. గనుల కేటాయింపు వ్యవహారంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన శాసనసభ సభ్యత్వాన్ని గవర్నర్ రద్దు చేశారు. ఎన్నికల కమిషన్ సూచనమేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో సోరెన్ ఎమ్మెల్యే హోదా కోల్పోయారు.
అక్రమ మైనింగ్ వ్యవహారంలో సీఎం సోరెన్కు సంబంధాలున్నట్టు తేలినందున ఆయన ఎమ్మెల్యే పదవి రద్దు చేయాలని ఎన్నికల సంఘం గవర్నర్కు సూచించింది. ఈ నేపథ్యంలోనే గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. శాసనసభ సభ్యత్వం రద్దయినా, సోరెన్ సీఎంగా కొనసాగవచ్చు. యుపిఎ మిత్రపక్షాలు ఆయనకు మద్దతు తెలిపితే సరిపోతుంది.
అయితే, మరో ఆరు నెలల్లోగా ఆయన శాసనసభకు తిరిగి ఎన్నిక కావాల్సి ఉంటుంది. తాజా పరిణామాల అనంతరం సీఎం హేమంత్ సోరెన్ శుక్రవారం యుపిఎ ఎమ్మెల్యేలతో తన నివాసంలో సమావేశమయ్యారు. సోరెన్పై అనర్హత వేటు పడినా, జార్ఖండ్లో యుపిఎ సర్కార్కు ఢోకా లేదని కాంగ్రెస్ నేత, మంత్రి అలంగీర్ ఆలమ్ స్పష్టం చేశారు.
81 సభ్యుల అసెంబ్లీలో ప్రతిపక్ష బిజెపికి 28 మంది సభ్యులున్నారని, తమ కూటమికి మ్యాజిక్ ఫిగర్ను మించి సీట్లున్నాయని ఆయన చెప్పారు. బిజెపి కుట్రతో ఎమ్మెల్యేగా అనర్హత వేటుపడ్డా.. హేమత్ సోరెన్ సీఎంగా కొనసాగుతారని తెలిపారు. జెఎంఎం అధికార ప్రతినిధి సుప్రీయో భట్టాచార్య మాట్లాడుతూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన సర్కార్ను కూల్చేందుకు బిజెపి కుట్రలు మొదలయ్యాయని విమర్శించారు.