ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ శాసనసభ్యత్వం చెల్లదని రాష్ట్ర గవర్నర్ రమేష్ బయాస్ ప్రకటించే అవకాశం ఉండడంతో, ఆ రాష్ట్రంలోని అధికార జేఎంఎం- కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర రాజకీయ సంక్షోభంకు గురవుతున్నది. తమ ఎమ్యెల్యేలను ఆకట్టుకొని, తమ ప్రభుత్వాన్ని కూల్చివేసే ప్రయత్నం జరగవచ్చని భయంతో ఎమ్యెల్యేలను రిసార్ట్ లకు తరలించారు.
ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, అధికారంలో ఉన్న సంకీర్ణ పక్ష ఎమ్మెల్యేలు శనివారం మూడు బస్సులలో రాష్ట్ర రాజధాని రాంచికి 30 కిమీ దూరంలో గల ఖుంతికి తరలించారు. గనులలీజ్ వ్యవహారంతో సిఎం సోరెన్ శాసనసభ్యత్వంపై అనర్హత వేటు ఊగిసలాట దశలో ఉంది. గవర్నర్ తమపై అనర్హత వేటు వేస్తే ఎమ్మెల్యేలు బిజెపి ప్రలోభానికి గురి కాకుండా ఉండేందుకు సోరెన్ అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.
ఈ బస్సులు చత్తీస్గఢ్ లేదా పశ్చిమ బెంగాల్కు వెళ్లినట్లు మొదట భావించారు. ఈ రెండు రాష్ట్రాలలో బిజెపియేతర ప్రభుత్వాలు అధికారంలో ఉండటంతో ఇక్కడి రిసార్ట్లను ఎంచుకుని సోరెన్ వారిని తరలించినట్లు వార్తలు వెలువడ్డాయి. ఆ ఎమ్మెల్యేలు పెట్టెబేడాలతోనే సిఎం అధికార నివాసానికి తరలివచ్చినట్లు, బయట విలేకరులకు కూడా కనపడకుండా తెల్లవారుజామున బస్సులలో ప్రయాణం అయినట్లు వార్తాసంస్థలు తెలిపాయి.
అయితే ఎమ్మెల్యేలు జార్ఖండ్ వీడి వెళ్లేది లేదని, ఇప్పుడు కేవలం సమీపంలోని కుంతి జిల్లాలోని లత్రాతూ వద్ద ఉన్న మూమెంట్ రిసార్ట్కు కేవలం పిక్నిక్కు వెళ్లినట్లు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి మంత్రి, సోరెన్ సన్నిహితుడు అలంగిర్ అలం తెలిపారు. ఎమ్మెల్యేలు రాంచీలోనే ఉంటారని, వీరిని ఇతరులు ఎవరూ ప్రలోభపెట్టలేరని శుక్రవారం రాత్రి ఈ మంత్రి తెలిపారు.
అయితే మరుసటి రోజు గుర్తు తెలియని ప్రాంతానికి మూడు బస్సులు వెళ్లినట్లు స్థానిక పత్రికలు తెలిపాయి. ఎమ్మెల్యేలు సాయంత్రం వరకూ పిక్నిక్కు వెళ్లి తిరిగివస్తారని రాష్ట్ర మంత్రి బన్నా గుప్తా కూడా తెలిపారు.కొంచెం వినోదం కూడా ఉండాలి కదా అందుకే బయటకు వెళ్లుతున్నామని కాంగ్రెస్ ఎమ్మెల్యే దీపికా పాండే సింగ్ తెలిపారు.
తాము పార్టీ ఆదేశాలను పాటించి ఏది చేయమంటే అది చేస్తామని కాంగ్రెస్కే చెందిన మరో ఎమ్మెల్యే స్పష్టం చేశారు. జార్ఖండ్ అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 81. ఇందులో అధికార సంకీర్ణ బలం 49….ఇందులో సోరెన్ నాయకత్వపు జెఎంఎం బలం అత్యధిక మెజార్టీపక్షంగా 30 మంది ఎమ్మెల్యేలతో ఉంది.
కాంగ్రెస్ 18 మందితో, ఆర్జెడీ 1 సంఖ్యాబలంతో ఉంది. ప్రధాన ప్రతిపక్షం అయిన బిజెపి సభలో 26 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సంకీర్ణం నుంచి ఎక్కువ మంది ఎమ్మెల్యేలను లాగడం కష్టం కాకపోయినా ఇప్పటికిప్పుడు అసాధ్యం అని తేల్చుకుంటున్న బిజెపి రాష్ట్రంలో ఏదో విధంగా మధ్యంతర ఎన్నికలకు పావులు కదుపుతున్నట్లు వెల్లడైంది. ఈ లోగా క్యాంప్ రాజకీయాలతో అధికార పక్షంలో హడావిడి నెలకొంది.