కాంగ్రెస్ ను వీడిన సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ త్వరలోనే కొత్త ప్రాంతీయ పార్టీ పెట్టనున్నారు. ఆజాద్ కొత్త పార్టీ పెడతారని, దీనిపై రెండు వారాల్లో ప్రకటన చేస్తారని ఆయన అనుచరుడు జీఎం సరూరీ వెల్లడించారు. ముందుగా జమ్మూకాశ్మీర్ లో పార్టీ పెడతారని, ఆ తర్వాత జాతీయ స్థాయి పార్టీపై ఆలోచన చేస్తారని ఆయన తెలిపారు.
కాంగ్రెస్ కు రాజీనామా చేసిన తర్వాత మొదటగా సెప్టెంబర్ 4న ఆజాద్ జమ్మూకు వస్తారని, కొత్త పార్టీ ఏర్పాటుపై మద్దతుదారులతో చర్చిస్తారని ఆయన చెప్పారు. ఆజాద్ ది సెక్యులర్ భావజాలమని, ఆయన ఎట్టిపరిస్థితుల్లోనూ బీజేపీతో కలిసి పని చేయరని ఆయన స్పష్టం చేశారు. ఆజాద్ కాంగ్రెస్ ను వీడడంతో ఏం చేయాలో అర్థం కాక, ఆయనపై ఆ పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
‘‘ఆజాద్ జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రిగా పని చేశారు. ఆయన పాలనాకాలం స్వర్ణయుగం లాంటిది. ఇప్పుడాయన తిరిగి జమ్మూ కాశ్మీర్ కు రావడం ఆనందంగా ఉంది” అని ఆయన పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్ ను తిరిగి ఒక్కటి చేసి, ప్రత్యేక హోదా ఇవ్వాలనే అంశాన్ని తమ పార్టీ మేనిఫెస్టోలో పెడతామని ఆయన వెల్లడించారు.
ఇక, జమ్మూకాశ్మీర్ లో కాంగ్రెస్ పనైపోయిందని సరూరీ స్పష్టం చేశారు. ఇప్పటికే ఆజాద్ కు మద్దతుగా మాజీ మంత్రులు, సీనియర్ నేతలు, కార్యకర్తలు వందలాది మంది కాంగ్రెస్ కు రాజీనామా చేశారని ఆయన చెప్పారు. ఇంకొంత మంది ఆ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కాగా మాజీ మంత్రి, కాంగ్రెస్ జమ్మూ కాశ్మీర్ మాజీ వైస్ ప్రెసిడెంట్ అయిన సరూరీ.. ఆజాద్ కు మద్దతుగా ఆ పార్టీకి రాజీనామా చేశారు.
ఆజాద్ పై మండిపడుతున్న కాంగ్రెస్ నేతలు
మరోవంక, పార్టీకి రాజీనామా చేయడమే కాకుండా రాహుల్ గాంధీపై వ్యక్తిగతంగా తీవ్రమైన ఆరోపణలు చేసిన ఆజాద్ పై కాంగ్రెస్ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు బిజెపిపై పోరుకు సమాయత్తం అవుతున్న దశలో రాహుల్పై వ్యక్తిగత దూషణలు చవకబారు మాటలకు దిగుతారా? అంటూ గులాం నబీ ఆజాద్పై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు.
ఆజాద్ పార్టీలో 50 ఏళ్లుగా పలు పదవులు అనుభవించారు. ప్రజల కోసం, దేశం కోసం పార్టీ కోసం పలు అంశాలను విరివిగా ప్రస్తావించాల్సిన దశలో బాధ్యతను విస్మరించి ఆజాద్ ఈ విధంగా వ్యవహరించి రాజీనామాకు దిగితే ఏమనుకోవల్సి ఉంటుందని పార్టీలో యువనేత సచిన్ పైలట్ నిలదీశారు.
గులాం నబీజీ జాన్ మిమ్మల్ని రాజ్యసభలో ప్రతిపక్ష నేత చేసింది ఎవరు? ఇతర కీలక బాధ్యతలు ఇచ్చింది ఎవరు? తెలిసి మాట్లాడండని సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఎదురుదాడికి దిగారు. యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బివి శ్రీనివాస్ స్పందిస్తూ ఆజాద్ పలుసార్లు తమ అధికారాన్ని దుర్వినియోగపర్చారని, రాహుల్ వైఖరి బాగా లేదని అనుకున్నప్పుడు ఆయన యుపిఎ హయాంలో మంత్రిగా ఎందుకు కులికారని ప్రశ్నించారు.
ఆజాద్ కేవలం వ్యక్తిగత స్వార్థంతోనే ఈ విధంగా వ్యవహరిస్తున్నారని, సైద్థాంతిక ఆలోచనలు ఏమీ లేవని సిడబ్లుసి సభ్యులు తారీక్ హమీద్ కర్రా విమర్శించారు. పార్టీ నేతలు విదేశాలకు వెళ్లినప్పుడు సోనియా చికిత్స జరుగుతున్నప్పుడు ఆజాద్ ఈ విధంగా చేయడం కృతజ్ఞత అన్పించుకుంటుందా? అని నేతలు ప్రశ్నించారు.
మునక పడవలో నుంచి దూకుళ్లు
మరోవంక, ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి మునిగే పడవ స్థాయికి చేరిందని, దీనితోనే రణగొణధ్వనులతో పడవలో నుంచి దూకుతున్నారని బిజెపి నేత, మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఎద్దేవా చేశారు. ఇక ఆ నౌక మునక తప్పదని స్పష్టం చేశారు.
ఆజాద్ లేవనెత్తిన కొన్ని అంశాలు సముచితంగానే ఉన్నాయని చెబుతూ చాలా కాలంగా పార్టీలో అంతర్గత పరిస్థితి క్లిష్టంగానే ఉందని తెలిపారు. ఇప్పుడు ఆజాద్ విముక్తుడు అయ్యాడు. తాను ముందే అయ్యానని మరో నేత, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారని గుర్తు చేశారు.