స్నేహం ఎలాంటి సమస్యనైనా పరిష్కరిస్తుందని, భారత్ తో తమ స్నేహం అలాంటిదేనని బంగ్లా ప్రధాని షేక్ హసీనా స్పష్టం చేశారు. నాలుగు రోజుల భారత్ పర్యటనలో భాగంగా మంగళవారం భారత ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. రక్షణ, వాణిజ్య రంగాలతో పాటు నదీ జలాల పంపిణీకి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా సంయుక్తంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ భారత్-బంగ్లా సంబంధాలు రానున్న రోజుల్లో కొత్త శిఖరాలకు చేరుతాయని ప్రధాని నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. భారత్ బంగ్లాదేశ్ మధ్య వాణిజ్యం వేగంగా పెరుగుతుందని చెబుతూ ఐటీ, అంతరిక్షం, అణు రంగాల్లో సహకారం అందించాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.
విద్యుత్ ప్రసార మార్గాలపై భారత్, బంగ్లాదేశ్ లో కూడా చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. 54 నదులు భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల గుండా ప్రవహిస్తాయని, ఇవి ఇరు దేశాల ప్రజల జీవనోపాధికి ఉపయోగపడుతున్నాయని చెప్పారు. కుషియారా నది నీటిభాగస్వామ్యానికి ముఖ్య ఒప్పందం చేసుకున్నామని ప్రకటించారు .
మొత్తం భారత్, బంగ్లాదేశ్ మధ్య ఏడు అవగాహన ఒప్పందాలు జరిగాయి. వరదలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు బంగ్లాదేశ్కు అందిస్తున్నామన్నారు. ఉగ్రవాదం, మతోన్మాద శక్తుల ప్రమాదాలను రెండు దేశాలు ఎదుర్కొంటున్నాయని చెబుతూ వాటిని ఎదుర్కోవడంలో రెండు దేశాలు కలసి నిలబడతాయని ఈ సందర్భంగా ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
1971 నాటి స్ఫూర్తి కొనసాగించడం కోసం ఇటువంటి శక్తులకు వ్యతిరేకంగా రెండు దేశాలు సహకరించుకోవడం చాలా అవసరమని ఆయన తెలిపారు. ఈ ప్రాంతంలో నేడు భారత దేశానికి అభివృద్ధి, వ్యాపార రంగాల్లో అతి పెద్ద భాగస్వామి బంగ్లాదేశ్ అని ప్రధాని మోదీ గుర్తుచేస్తూ ఇరు దేశాల మధ్య వ్యాపారం వేగంగా వృద్ధి చెందుతోందని తెలిపారు.
షేక్ హసీనా మాట్లాడుతూ, స్వాతంత్ర్య వజ్రోత్సవాలను విజయవంతంగా పూర్తి చేసుకున్నందుకు భారత ప్రభుత్వాన్ని అభినందించారు. తమ చర్చల ఫలితాలు ఇరు దేశాల ప్రజలకు లబ్ధి చేకూర్చుతాయని చెప్పారు. తాము సుహృద్భావ వాతావరణంలో స్నేహ భావంతో చర్చలు జరిపామని ఆమె వివరించారు.
అంతకు ముందు రాష్ట్రపతి భవన్ లో షేక్ హసీనాకు ప్రధాని మోదీ స్వాగతం పలికారు. తర్వాత షేక్ హసీనా గౌరవ వందనం స్వీకరించారు. మహాత్మా గాంధీ స్మారక స్థూపం రాజ్ ఘాట్ దగ్గర పూలమాలలు వేసి నివాళులర్పించారు. తర్వాత విజిటర్స్ బుక్ లో సందేశం రాశారు. అక్కడ్నుంచి హైదరాబాద్ హౌస్ కు బయల్దేరారు. అక్కడ ఇరు దేశాల ప్రధానులు, అధికారుల మధ్య ఒప్పందాలపై చర్చలు కొనసాగాయి.