2024 ఎన్నికలలో బిజెపి ప్రాబల్యాన్ని కట్టడి చేసేందుకై కొన్ని ప్రాంతీయ పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తున్నది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ తో సంబంధం లేకుండా, ముఖ్యంగా దేశంలోనే పెద్ద రాష్ట్రాలైన ఉత్తర ప్రదేశ్, బీహార్ లలో ఆ పార్టీని కట్టడి చేయడం ద్వారా పార్లమెంట్ లో సొంతంగా ఆధిక్యత సంప్రదించకుండా చేసేందుకు ఎత్తుగడలు వేస్తున్నారు.
ఈ దిశలో ఈ రెండు రాష్ట్రాలలో బిజెపి ప్రధాన రాజకీయ ప్రత్యర్థులైన జేసియు, ఆర్జేడీ, సమాజ్ వాద్ పార్టీల నేతలు ఉమ్మడిగా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలుస్తున్నది. తాజాగా అసెంబ్లీ ఎన్నికలలో అనూహ్య విజయం సాధించి, తమకు తిరుగులేదని బిజెపి ధీమాగా ఉన్న ఉత్తర ప్రదేశ్ పై దృష్టి సారిస్తున్నారు. 2019 ఎన్నికలలో ఈ రాష్ట్రంలోని 80 లోక్సభ స్థానాలలో బిజెపి 65 స్థానాలలో గెలుపొందింది. ఆ సంఖ్యను సగంకుపైగా తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ ప్రయత్నాలలో భాగంగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఉత్తర ప్రదేశ్ నుండి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఆయన సామాజిక వర్గానికి చేసిన వారు ఇప్పటి వరకు బిజెపికి మద్దతు ఇస్తున్నారు. వారిని ఆ పార్టీకి దూరం చేయడమే ఆయన లక్ష్యంగా కనిపిస్తుంది. అందుకు సమాజ్ వాద్ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మద్దతుగా నిలుస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో జేడీయూ, ఎస్పీ కలిసి పోటీ చేయడానికి ఇప్పటికే సూత్రప్రాయంగా అంగీకరించినట్లు చెబుతున్నారు. రాష్ట్రంలోని ఏ స్థానం నుంచైనా పోటీ చేయాలని అఖిలేష్ నితీశ్ను ఆహ్వానించినట్లు వార్తలు వస్తున్నాయి. రాష్ట్రం నుంచి బరిలోకి దిగినట్లయితే ఎస్పీ పూర్తిస్థాయిలో సహకరిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది.
యూపీలోని ఫుల్పూర్ లోక్సభ స్థానం నుంచి నితీష్ పోటీ చేసే అవకాశాలున్నాయని జెడియు వర్గాలు వెల్లడించాయి. ఫుల్పూర్ నుంచే కాకుండా అంబేద్కర్ నగర్, మీర్జాపూర్ లోక్సభ నియోజకవర్గాల్లో ఏదో ఒక స్థానం నుంచి నితీశ్ పోటీ చేసే అవకాశం ఉందని జేడీయూ యూపీ అధ్యక్షుడు లలన్ సింగ్ తెలిపారు.