ఉత్తరప్రదేశ్లోని అయోధ్య జిల్లాలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు అంకితం చేసిన ఒక గుడి వెలుగులోకి వచ్చింది. భరత్కుండ్ సమీపంలోని పూర్వా గ్రామంలోని ఈ గుడిలో యోగి ఆదిత్యనాథ్ను రాముడి అవతారంగా ఏర్పాటు చేశారు.
ఆలయంలో ప్రతిష్టించిన యోగీ విగ్రహం ముందు రోజూ రెండు సార్లు ఉదయం, సాయంత్రం ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేస్తున్నారు. పూజల అనంతరం భక్తులకు ప్రసాదం కూడా పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది. భరత్కుండ్ రాముడు అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు అతని సోదరుడు భరత్ అతనికి వీడ్కోలు పలికిన ప్రదేశం అని నమ్ముతారు.
అయోధ్యలో రాముడి జన్మభూమికి 25 కి.మీల దూరంలో భరత్కుండ్ సమీపంలో ఫైజాబాద్- ప్రయాగ్రాజ్ హైవే వద్ద ఈ ఆలయాన్ని అయోధ్య నివాసి ప్రభాకర్ మౌర్య నిర్మించారు. అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించే వ్యక్తిని పూజిస్తానని 2015లో మౌర్య ప్రతిజ్ఞ చేశారు. మౌర్య మాట్లాడుతూ తాను రాముడి కోసం చేసినట్లే రోజూ యోగి ఆదిత్యనాథ్ విగ్రహం ముందు శ్లోకాలు పఠిస్తూ ఉంటానని చెప్పాడు.
యూపీలోని బారాబంకి జిల్లాకు చెందిన తన స్నేహితుడు రెండు నెలల్లో రాముడిని పోలిన యోగి ఆదిత్యనాథ్ విగ్రహాన్ని తయారు చేసినట్లు చెప్పాడు. ఆలయ నిర్మాణానికి దాదాపు రూ. 8.5 లక్షలు ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. యోగీ ప్రజల కోసం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు తనను ఆకర్షించాయని, అందుకే ఆయనకు గుడి నిర్మించాలన్న ఆలోచన వచ్చిందని చెప్పారు. తనకు ఉద్యోగం లేదని, భూమి లేదని అయినా యూట్యూబ్లో భజనలు, భక్తి గీతాలు పోస్టు చేస్తూ నెలకు లక్ష రూపాయలు సంపాదిస్తున్నానని తెలిపారు. ఆ డబ్బుతోనే ఈ గుడి నిర్మించానని మౌర్య చెప్పారు.