ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గురువారం ముస్లిం మత పెద్దలతో భేటీ అయ్యారు. సంఘ్ ప్రచారక్ లు రామ్ లాల్, నందగోపాల్, ఇంద్రేష్ కుమార్ లతో కలిసి కస్తూర్బా గాంధీ మార్గ్లోని మసీదుకు వెళ్లిన ఆయన ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ చీఫ్ ఉమర్ అహ్మద్ ఇలియాసీతో భేటీ అయ్యారు. దాదాపు 2 గంటల పాటు వారి రహస్య సమావేశం సాగింది.
ఉమర్ అహ్మద్ ఇల్యాసీని ఉటంకిస్తూ ఓ వార్తా సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం, ‘‘నా ఆహ్వానం మేరకు మోహన్ భగవత్ గారు నాతో సమావేశమయ్యారు. ఆయన జాతి పిత, జాతి రుషి; ఆయన సందర్శనతో ఓ మంచి సందేశం వెళ్తుంది. మేం దేవుడిని ఆరాధించే విధానాలు వేర్వేరు, అయినప్పటికీ అతి పెద్ద మతం మానవత్వమే. దేశానికే పెద్ద పీట అని మేం విశ్వసిస్తున్నాం’’ అని ఇల్యాసీ అన్నట్లు ఆ వార్తా సంస్థ పేర్కొంది.
అయితే వెంటనే వివరణ ఇస్తూ భారత దేశంలో ఒకరే `జాతిపిత’ ఉన్నారని అంటూ `మనమందరం భారత మాత సంతానమే’ అని డా. భగవత్ స్పష్టం చేశారు. వీరిద్దరూ ఓ గంటకు పైగానే ఏకాంతంగా చర్చలు జరిపినట్లు తెలిపింది. అనంతరం మదర్సాను సందర్శించిన ఆర్ఎస్ఎస్ చీఫ్ అక్కడి విద్యార్థులతో ముచ్చటించారు.
మరోవైపు ఈ భేటీపై స్పందించిన ముస్లిం మత పెద్దలు ఇది దేశానికి మంచి సందేశాన్ని పంపుతుందని అభిప్రాయపడ్డారు. తామంతా కుటుంబ సభ్యుల్లా చర్చించామని, తమ ఆహ్వానాన్ని మన్నించి మోహన్ భగవత్ తమను కలిసేందుకు రావడం సంతోషంగా ఉందని అన్నారు.
మత సామరస్యాన్ని పెంపొందించే ప్రయత్నంలో భాగంగా మోహన్ భగవత్ ముస్లిం పెద్దలను కలిశారని ఆర్ఎస్ఎస్ ప్రకటించింది. ఆర్ఎస్ఎస్ అధికార ప్రతినిధి సునీల్ అంబేద్కర్ మాట్లాడుతూ, నిరంతర చర్చల ప్రక్రియలో భాగంగా ఈ సమావేశం జరిగిందని చెప్పారు. మోహన్ భగవత్ అన్ని రంగాల్లోని ప్రముఖులతోనూ చర్చలు జరుపుతున్నారని తెలిపారు.
కర్నాటకలో హిజాబ్ ఘటన, మహమ్మద్ ప్రవర్తపై నుపుర్ శర్మ వ్యాఖ్యలు తదనందరం చెలరేగిన హింస నేపథ్యంలో ఈ పరిణామం చాలా కీలకంగా మారింది. వారణాసిలోని జ్ఞాన్వాపి మసీదు సముదాయంలోని ఒక మందిరంలో హిందువులు ప్రార్థనలకు అనుమతించాలన్న పిటిషన్, ప్రతి మసీదు కింద ఒక శివలింగాన్ని వెతకాలన్న మోహన్ భగవత్ ప్రకటన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరింప చేసుకొంది.
ఇటీవల కాలంలో ఆయన పలువురు ముస్లిం ప్రముఖులు, మేధావులను కలుస్తున్నారు. మనందరిదీ ఒకే డీఎన్ఏ అని అయితే దేవున్ని పూజించే విధానం మాత్రమే భిన్నంగా ఉంటుందని ఒక సందర్భంలో ఆయన స్పష్టం చేయడం గమనార్హం.