కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తుండడంతో ముఖ్యమంత్రి పదవికి పోటీ చేయమని `ఆదేశించడం’తో పాటు, ఆ స్థానంలో తన సన్నిహితుడు సచిన్ పైలట్ ను ఎంపిక చేసేందుకు రాహుల్ గాంధీ చేస్తున్న ప్రయత్నాలపై అశోక్ గెహ్లాట్ వర్గం బహిరంగంగా తిరుగుబాటుకు సిద్దమయింది. దానితో సచిన్ ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకునేందుకు ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన ఎమ్యెల్యేల సమావేశం జరగనే లేదు.
ఈ సమావేశం జరపడానికి ఏఐసీసీ పరిశీలకులుగా వచ్చిన మల్లిఖార్జున్ ఖర్గే, అజయ్ మకెన్ లు నిసాహయంగా తిరిగి వెళ్ళవలసి వచ్చింది. పైగా, ప్రస్తుత ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ వర్గానికి చెందిన 92 మంది ఎమ్మెల్యేలు అధిష్ఠానంపై తిరుగుబావుటా ఎగురవేస్తూ మూకుమ్మడి రాజీనామాలు చేశారు. ఈ మేరకు తమ రాజీనామా పత్రాలను అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషికి గత రాత్రి సమర్పించారు.
ఓవైపు సీఎంగా తానే కొనసాగుతానని గెహ్లాట్ పట్టుబడుతూ వస్తున్న గెహ్లాట్, ఒక వేళ రాజీనామా చేసినా రాహుల్ కోరుకొంటున్నట్లు సచిన్ ఫైలట్ కు సీఎం పగ్గాలు అప్పగించేందుకు అసలు ఒప్పుకోవడం లేదు.ఒక వేళ రాజీనామా చేయవలసి వస్తే, తాను సూచించిన వారినే ముఖ్యమంత్రిగా చేయాలని స్పష్టం చేస్తున్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీ స్పీకర్ సిపి జోషి పేరును తెరపైకి తెస్తున్నారు.
మామూలుగా ఇలాంటి పరిస్థితుల్లో హైకమాండ్ నిర్ణయమే శిరోధార్యమనే ఏకవాక్య తీర్మానాన్ని చేస్తుంటారు. దానికి భిన్నంగా సీఎల్పీ భేటీకి ముందే మంత్రి శాంతి ధారీవాల్ నివాసంలో గెహ్లాట్ వర్గం ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అశోక్ గెహ్లాట్ నే సీఎంగా ఉంచాలనీ, లేదంటే 2020లో సచిన్ పైలట్ తిరుగుబాటు చేసినప్పుడు సర్కారుకు అండగా ఉన్న వారిలో ఎవరినైనా ముఖ్యమంత్రిని చేయాలని వీరంతా నిర్ణయించినట్టు తెలుస్తోంది.
తాజా రాజకీయ పరిస్థితుల్లో అశోక్ గెహ్లాట్ , సచిన్ పైలట్ లను ఢిల్లీ రావాలని అధిష్ఠానం ఆదేశించినట్టు తెలుస్తోంది. దీనిపై పార్టీ పెద్దలు గెహ్లాట్ తో మాట్లాడారు. ఐతే ఎమ్మెల్యేలంతా సీరియస్ గా ఉన్నారని, ఈ పరిస్థితులలో తానేమీ చేయలేనని గెహ్లాట్ స్పష్టం చేసిన్నట్లు తెలుస్తోంది. ఒక వ్యక్తికి ఒకే పదవి అంశంపై హైకమాండ్ పునరాలోచన చేయాలని గెహ్లాట్ వర్గం డిమాండ్ చేస్తోంది. రెండు పదువులను నిర్వహించే సామర్థ్యం అశోక్ గెహ్లాట్ కు ఉందని వారు అంటున్నారు.
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సీఎం గెహ్లాట్తో ఫోన్లో మాట్లాడారు. అయితే ఈ సందర్భంగా సీఎంగా పైలట్ ఎంపికపై గెహ్లాట్ అసంతృప్తిని వెల్లగక్కినట్టు సమాచారం. ‘నా చేతుల్లో ఏం లేదు. ఎమ్మెల్యేలు అందరూ ఆగ్రహంగా ఉన్నారు’ అని వేణుగోపాల్కు స్పష్టం చేసినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
కాగా, అంతకుముందు జైసల్మేర్లోని ఓ ఆలయంలో ప్రార్థనలకు వచ్చిన గెహ్లాట్ మీడియాతో మాట్లాడుతూ ‘40 ఏండ్లుగా పలు రాజ్యాంగ పదవుల్లో పనిచేశాను. ఇంకా నేను ఏం పొందాలని కోరుకుంటాను? కాబట్టి, కొత్త తరానికి అవకాశం రావాలనేది నా మనసులో ఉన్నది’ అని తెలిపారు.
తదుపరి సీఎంగా సచిన్ పైలట్ అభ్యర్థిత్వాన్ని గెహ్లాట్ వర్గం ఎమ్మెల్యేలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 2020లో తిరుగుబాటు చేసి ప్రభుత్వాన్ని కూల్చాలని చూసిన వ్యక్తిని ఎలా సీఎం చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గెహ్లాట్ వర్గానికి చెందిన వ్యక్తినే సీఎం చేయాలని అధిష్ఠానాన్ని డిమాండ్ చేశారు.