కాంగ్రెస్ అధ్యక్ష పదవికి తాను పోటీ చేయడం లేదని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రకటించారు. తన విధేయులైన ఎమ్మెల్యేల తిరుగుబాటుకు నైతిక బాధ్యత వహిస్తున్నట్లు తెలిపారు. అయితే ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతారా? లేదా? అన్నది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది. రాజస్థాన్ కాంగ్రెస్ లో నెలకొన్న సంక్షోభం ఇప్పట్లో సద్దుమణిగే అవకాశం కనబడటం లేదు.
గెహ్లాట్ పార్టీ అధ్యక్ష పదవి చేపడితే ముఖ్యమంత్రి పదవిలోకి రావచ్చని ఎదురు చూసిన సచిన్ పైలట్ ప్రస్తుత పరిణామాలతో ఖంగు తిన్నారు. అయితే రాహుల్ గాంధీ వద్ద తనకు గల సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకొని ధిక్కార ధోరణి ప్రదర్శించిన గెహ్లాట్ ను సీఎం పదవి నుండి తప్పించవలసిందే అని పట్టుబడుతున్నట్లు తెలుస్తున్నది. పైలట్ గురువారం సాయంత్రం సోనియా గాంధీని కలిసి ఈ విషయమై చర్చించారు.
తాము ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే విషయం సోనియా ఇస్తామని గెహ్లాట్ మీడియాతో చెప్పినప్పటికీ సచిన్ కు ఆ పదవి కట్టబెట్టడానికి ఎట్టి పరిస్థితులలో సుముఖంగా ఉండే అవకాశాలు కనబడటం లేదు. గెహ్లాట్పై సోనియా అసంతృప్తితో ఉన్నారని, ఇది సచిన్ పైలట్కు అనుకూలంగా ఉండవచ్చని పార్టీ వర్గాలు మరోవంక భావిస్తున్నాయి.
మరో రెండు రోజుల్లో రాజస్థాన్ సీఎంపై సోనియాగాంధీ నిర్ణయం తీసుకుంటారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పేర్కొనడం గమనార్హం. మరో వైపు గెహ్లాట్ అనుకూల ఎమ్మెల్యేలు మాత్రం పైలట్ను సీఎం చేస్తే.. తామంతా రాజీనామాలు చేస్తామని స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోనియా నిర్ణయం ఎలా ఉంటుందనేది చర్చనీయాంశంగా మారింది.
బుధవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్న గెహ్లాట్ గురువారం మధ్యాహ్నం గంటన్నర పాటు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో సమావేశమయ్యారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల నుండి తాను వైదొలుగుతున్నానని తెలిపారు. అయితే అంతిమ నిర్ణయం తీసుకోవాల్సిందిగా పార్టీ నాయకత్వానికే వదిలేశానని చెప్పారు. అలాగే రాజస్థాన్ సంక్షోభానికి కారణమైనందుకు సోనియాగాంధీకి క్షమాపణలు తెలిపారు.
ఇటీవల అధ్యక్షుడిగా పార్టీ బాధ్యతలు చేపట్టాల్సిందిగా రాహుల్ను కోరానని, ఆయన నిరాకరించారని, దీంతో తాను పోటీ చేస్తానని చెప్పానని చెప్పారు. అయితే ఒకే వ్యక్తి, ఒకే పదవి అనేది పార్టీ తీర్మానమని, ఆ తీర్మానాన్ని ఆమోదించలేని పరిస్థితి ఎదురైందని ఆయన పేర్కొన్నారు.
అదే సమయంలో రాజస్థాన్లో ఎమ్మెల్యేలు పార్టీ నాయకత్వంపై తిరుగుబాటు చేశారని, ఆ పరిస్థితికి నైతిక బాధ్యత వహిస్తూ తాను పోటీ నుంచి వైదొలుగుతున్నానని వెల్లడించారు. దీంతో అధ్యక్ష ఎన్నిక బరిలో సీనియర్ నేత దిగ్విజరు సింగ్ పోటీ ఖరారైంది. శుక్రవారం నామినేషన్ పత్రాలు సమర్పించనున్నట్లు ఆయన ప్రకటించారు.
దిగ్విజరు సింగ్ పది సెట్ల నామినేషన్ పత్రాలు తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎంపి శశిథరూర్ కూడా శుక్రవారమే నామినేషన్ పత్రాలు సమర్పించనున్నారు.