దేశ భద్రతలో భారత నౌకాదళం మరో మైలురాయి సాధించింది. అణు జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిహంత్ నుంచి బాలిస్టిక్ క్షిపణిని శుక్రవారం ప్రయోగించింది. కీలకమైన ఈ పరీక్షలో విజయం సాధించింది. అణు జలాంతర్గామి ద్వారా ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణి బంగాళాఖాతంలో నిర్దేశించిన లక్ష్యాన్ని ఖచ్చితత్వంతో ఛేదించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.
దేశ ఆయుధ వ్యవస్థ, కార్యాచరణ, సాంకేతిక పరిమితులను దీని ద్వారా ధృవీకరించినట్లు పేర్కొంది. జలాంతర్గామి నుంచి బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం (ఎస్ఎల్బీఎం) భారత నౌకాదళ అణు నిరోధకత, దేశ అణు సామర్థ్య విశ్వనీయతను రుజువు చేసిందని వెల్లడించింది.
కాగా, శత్రు దేశాలైన చైనా, పాకిస్థాన్కు చెందిన సబ్మెరైన్లు, యుద్ధ నౌకలను సముద్ర జలల కింది నుంచి కూడా లక్ష్యంగా చేసుకునే సామర్థ్యాన్ని ఈ ప్రయోగం ద్వారా భారత్ సాధించింది. అలాగే దేశీయంగా నిర్మించిన అణు జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిహంత్ క్లాస్ సబ్మెరైన్ల పూర్తి సంసిద్ధత, కార్యాచరణను ఈ టెస్ట్ ద్వారా నిర్ధారించారు.
బాలిస్టిక్ క్షిపణి ఆయుధాలతో కూడిన అణుశక్తి సబ్మెరైన్లు కలిగిన దేశాల్లో భారత్ ఆరవ స్థానంలో ఉంది. అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా సరసన భారత్ చోటు దక్కించుకుంది. అయితే అణు క్షిపణులను తొలుత ప్రయోగించబోమన్న నిబద్ధతకు భారత్ కట్టుబడి ఉంది.