భారత దేశం లో పరిశ్రమలు , తయారీ రంగాలను ప్రోత్సహించాలని కేంద్ర వాణిజ్యం, పరిశ్రమలు శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపిచ్చారు. హైదరాబాద్ లో అఖిల భారత వైశ్య ఫెడరేషన్ (ఎఐవైఎఫ్)ను ఉద్దేశించి ప్రసంగించారు. భారత దేశంలో తయారైన ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని వ్యాపార, వాణిజ్య వర్గాలను ఆయన కోరారు
ఇది ఉపాధిని పెంపొందించడానికి, మన పౌరుల జీవితాలలో సంవృద్ధిని తీసుకురావడానికి దోహద పడుతుందని ఆయన తెలిపారు. ప్రయాణికులు, పర్యాటకులు తమ ప్రయాణ బడ్జెట్లో కనీసం 5 శాతాన్ని స్థానికంగా తయారు చేసిన ఉత్పత్తులపై ఖర్చు చేయాలని ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపును మంత్రి సమర్థించారు.
ప్రతిభావంతులైన మన చేతివృత్తులవారు, హస్తకళాకారులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు మద్దతు ఇవ్వడానికి, ప్రోత్సహించడానికి అర్హులని మంత్రి చెప్పారు. గత 30 సంవత్సరాలలో భారత దేశ జీడీపీ 11.8 రెట్లు పెరిగిందని గోయల్ వివరించారు. ఒకప్పుడు జనాభాలో అధిక భాగం మందికి ఆహారం, దుస్తులు, నివాస వసతి వంటి జీవితానికి అవసరమైన ప్రాథమిక అవసరాలకు భరోసా లేని పరిస్థితి ఉండేదని ఆయన గుర్తు చేశారు.
జీవనావసరాల కోసం నిరంతర పోరాటం నుండి ప్రజలను విముక్తులను చేసే నిర్మాణాత్మక సంస్కరణలపై ప్రభుత్వం విస్తృతంగా దృష్టి సారించడం వల్ల ఇప్పుడు పరిస్థితి గణనీయంగా మెరుగుపడిందని ఆయన పేర్కొన్నారు. చాలా ప్రాథమిక అవసరం అయిన సురక్షితమైన పారిశుధ్యం దిశగా దేశంలోని ప్రతి ఇంటికి 12 కోట్లకు పైగా మరుగుదొడ్లను నిర్మించడంలో ప్రభుత్వం సాధించిన విజయం తన హృదయాన్ని ఆకట్టుకున్న మంచి సంస్కరణ అని ఆయన పేర్కొన్నారు.
“ఇది మరుగుదొడ్లకు సంబంధించిన విషయం కాదు, ముఖ్యంగా మన మహిళల హుందాధనంకు, ఆత్మగౌరవానికి సంబంధించినది” అని ఆయన తెలిపారు. జాతీయ ఆహార భద్రత చట్టం (ఎన్ఎఫ్ఎస్ఏ) కింద ఆహార ధాన్యాలను సరఫరా చేయడం ద్వారా దాదాపు 80 కోట్ల మంది పౌరులకు ఆహార భద్రతను ప్రభుత్వం నిర్ధారించిందని, ప్రతి వ్యక్తికి నెలకు అదనంగా 5 కిలోల ఆహార ధాన్యాలను సరఫరా చేసిందని మంత్రి తెలిపారు.
నిజంగా అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడానికి వారి డబ్బును బాగా ఉపయోగిస్తుండటం పన్ను చెల్లింపుదారులకు సంతృప్తి కలిగించే విషయంగా ఉండాలని ఆయన సూచించారు. 50 కోట్ల ప్రజలకు ప్రస్తుతం ఉచిత , నాణ్య మైన ఆరోగ్య సంరక్షణ ను అందిస్తున్నామని, జల జీవన్ మిషన్ లో భాగంగా కుళాయిల ద్వారా ప్రతి ఇంటికీ స్వచ్ఛ మైన తాగునీరు అందిస్తున్నామని కేంద్ర మంత్రి వివరించారు.
మహిళల ప్రాథమిక అవసరాలను, ముఖ్యంగా రుతుస్రావ పరిశుభ్రతను కాపాడాల్సిన ఆవశ్యకత గురించి మంత్రి మాట్లాడారు. యుక్తవయసు వచ్చాక బాలికలు పాఠశాలలకు దూరమవడంపై ఆందోళన వ్యక్తం చేసిన మంత్రి, ప్రభుత్వం శానిటరీ న్యాప్కిన్లను చాలా తక్కువ ధరలకు అందిస్తోందని చెప్పారు.
అభివృద్ధి చెందిన దేశంగా, విశ్వగురువుగా ఎదిగే దిశగా నిర్ణయాత్మక చర్యలు తీసుకునేందుకు భారత్ సిద్ధంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు. భారత దేశం లోని భారీ యువ జనాభాకు ఈ అన్వేషణను ముందుకు తీసుకువెళ్లే సామర్థ్యం ఉందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. “ఈ రోజు ప్రపంచంలో భారతదేశం మాత్రమే ప్రకాశవంతమైన ప్రదేశం. ప్రపంచం గొప్ప ఆశలతో భారతదేశం వైపు చూస్తోంది” అని ఆయన పేర్కొన్నారు.