దేశ చరిత్రలోనే వైఎస్ రాజశేఖరరెడ్డి అరుదైన నేతగా నిలిచారని ఏపీ రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కొనియాడారు. వైఎస్ఆర్ లైఫ్టైమ్ అఛీవ్మెంట్, వైఎస్ఆర్ అచీవ్మెంట్ -2022 అవార్డుల ప్రధానోత్సవం విజయవాడ ఎవన్ కన్వెన్షన్ సెంటర్లో మంగళవారం జరిగింది.ఈ కార్యక్రమానికి ఐఅండ్ పిఆర్ కమిషనర్ తుమ్మా విజరుకుమార్రెడ్డి సమన్వయకర్తగా వ్యవహరించగా, ఆత్మీయ అతిధిగా. వైఎస్ విజయమ్మ వేదికపై ఆశీనులయ్యారు.
ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో విశేష సేవలందించిన 30 సంస్థలు, 35మంది వ్యక్తులకు గవర్నర్ అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకున్నారని, ముఖ్యమంత్రి కాగానే అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని పేర్కొన్నారు. వివిధ రంగాల్లో సేవ చేసిన వ్యక్తులకు ఆయన పేరుతో అవార్డులు ఇవ్వడం సంతోషంగా ఉందని చెప్పారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ సామాన్యుల్లో ఉన్న అసమాన్యులకు, అసమాన్య సేవలందిస్తున్న మానవతా మూర్తులకు వరుసగా రెండో ఏడాది రాష్ట్ర ప్రభుత్వం తరపున వైఎస్ఆర్ అఛీవ్మెంట్, వైఎస్ఆర్ లైఫ్టైమ్ అచీవ్మెంట్ పేరుతో అవార్డులను ప్రధానం చేస్తున్నట్లు తెలిపారు.
తమ శ్రమతో, స్వేదంతో రాష్ట్ర చరిత్రను గొప్పగా లిఖిస్తున్న రైతన్నలకు ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా అవార్డులిస్తున్నట్లు చెప్పారు. సంస్కృతి, సాంప్రదాయాలకు దశాబ్ధాలుగా వారుధులుగా ఉన్న వారికి, మహిళల రక్షణకు నిరంతరం పాటు పడే రక్షణ సారధులకు, వెనుకబాటు మీద, అణచివేతమీద, పెత్తందారి పోకడలమీద దండయాత్రచేస్తున్న సామాజిక ఉద్యమకారులకు, భిన్నమైన కళాలకు, గళాలకు, పాత్రికేయులకు ఈ అవార్డులు ఇస్తున్నట్లు తెలిపారు.
ఇటువంటి సేవలను ప్రభుత్వం గుర్తిస్తుందని, వారికి అండగా ఉంటుందని చెప్పడానికే అవార్డులు ఇస్తున్నట్లు చెప్పారు.