పాకిస్థాన్ లేదా చైనా పౌరసత్వంగలవారు ఉత్తర ప్రదేశ్లో వదిలిపెట్టిన ఆస్తులను దురాక్రమణల నుంచి కాపాడేందుకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఇటువంటి భూములకు విముక్తి కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించింది.
హోం శాఖ పర్యవేక్షణలో వీటి ప్రస్తుత పరిస్థితిపై ఓ నివేదికను రూపొందించబోతోంది. యోగి నేతృత్వంలో శుక్రవారం జరిగిన హోం శాఖ ఉన్నతాధికారుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వివిధ జిల్లాల్లో ఉన్న శత్రు ఆస్తుల పరిరక్షణకు ఈ సమావేశంలో మార్గదర్శకాలను జారీ చేశారు. ఈ ఆస్తుల పరిరక్షణ, నిర్వహణ, పర్యవేక్షణల కోసం నోడల్ అధికారిగా ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారిని నియమించాలని నిర్ణయించారు.
రాష్ట్రాలు, దేశ సరిహద్దుల్లోని గ్రామాలను శక్తిమంతంగా తీర్చిదిద్దవలసి ఉందని యోగి అధికారులకు చెప్పారు. సరిహద్దుల్లోని గ్రామాలు, జిల్లాల సాంస్కృతిక, చారిత్రక వారసత్వాలను సమర్థవంతంగా ప్రచారం చేసి, పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు. ఈ ప్రాంతాలకు పాఠశాలల విద్యార్థినీ, విద్యార్థులను, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ కేడెట్లు, వాలంటీర్లను తీసుకెళ్ళాలని సూచించారు.
ఈ ప్రాంతాల్లో నివసిస్తున్న మాజీ సైనికులు, పారామిలిటరీ సిబ్బందిని సరిహద్దు సిపాయిలుగా గుర్తించాలని చెప్పారు. ఆయా ప్రాంతాల్లోని వ్యవస్థను నిర్వహించేందుకు వారి సహకారాన్ని తీసుకోవాలని చెప్పారు. సరిహద్దు జిల్లాల ప్రజలు నూటికి నూరు శాతం సంతృప్తి వ్యక్తం చేసే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను అమలు చేయాలని చెప్పారు.
మన దేశానికి చెందినవారు పాకిస్థాన్ లేదా చైనా పౌరసత్వం పొంది, మన దేశంలో ఉన్న తమ ఆస్తులను (ఇళ్లు, భూములు వంటివాటిని) వదిలిపెట్టి వెళ్లిపోతే, ఆ ఆస్తులను శత్రు ఆస్తులు అంటారు. ఉత్తర ప్రదేశ్లో ఇటువంటి ఆస్తులు 1,519 ఉన్నాయి. వీటిలో 936 ఆస్తులు మహ్ముదాబాద్ రాజుకు చెందినవి. ఆయన వారసులు పాకిస్థాన్ వెళ్లిపోయారు. ఈ శత్రు ఆస్తుల్లో చాలా వరకు ఆక్రమణలకు గురైనట్లు నివేదికలు చెప్తున్నాయి. దీంతో యథాతథ స్థితిని తెలుసుకోవాలని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది.