మొదటి నుండి గెలుపు పట్ల ధీమాగా ఉన్న బిజెపి అంచనాలను చౌటప్పాల్, చుండూరు మండలాలు కట్టడి చేశాయి. పట్టణ ప్రాంతాలైన చౌటుప్పల్, చండూరుపై బిజెపి పెట్టుకున్న అంచనాలు తారుమారయ్యాయి. అక్కడ కూడా టిఆర్ఎస్కు స్పష్టమైన మెజార్టీ రావడంతో పదో రౌండ్కే బిజెపి ఆశలు వదులుకుంది.
కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డితో రాజీనామా చేయించి గెలుపు మీద ధీమాతో బరిలోకి దిగిన బిజెపికి తీవ్ర నిరాశే ఎదురైంది. ఐదో రౌండ్ తర్వాత బిజెపి అభ్యర్థి రాజగోపాల్రెడ్డి కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు.
దానితో, కమ్యూనిస్టుల సహకారంతో టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి సమీప బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిపై 10,307 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. టిఆర్ఎస్కు 97,003, బిజెపికి 86,696 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి 23,864 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. బిఎస్పి 4,145 ఓట్లు మాత్రమే తెచ్చుకుంది.
మునుగోడులో జోరుగా ప్రచారం చేసిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఎ.పాల్కు 805 ఓట్లు పోలయ్యాయి. నోటాకు 482 ఓట్లు వచ్చాయి. ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు నల్గొండ గిడ్డంగుల శాఖ గోదాములో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.
మొత్తం 15 రౌండ్లు ఓట్లు లెక్కింపు జరగ్గా రెండో రౌండు, మూడో రౌండు మినహా మిగిలిన 13 రౌండ్లలోనూ టిఆర్ఎస్ ఆధిక్యం కనబర్చింది. స్వల్ప మెజార్టీలు నమోదవుతుండడంతో రౌండ్రౌండ్కూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
మునుగోడు నియోజకవర్గంలో 2 లక్షల 40 వేల ఓట్లు ఉంటే, చౌటుప్పల్ మండలంలో 83 వేలకు పై గా ఉన్నాయి. ఒక్క చౌటుప్పల్ మున్సిపాలిటీలోనే 23 వేల ఓట్లు ఉండగా, అందులో కేవలం 17 వేలు మాత్రమే పోలయ్యాయి. అంటే 73శాతం పోలింగ్ నమోదైంది. నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో 93 శాతం ఓటింగ్ నమోదైతే.. చౌటుప్పల్ పట్టణంలో ఇంత తక్కువగా పోలింగ్ జరగడం బీజేపీ గెలుపుపై ప్రభావం చూపింది. ఇక చౌటుప్పల్ మండలంలోని ఓట్లను మొత్తంగా 4 రౌండ్లలో లెక్కించగా… టీఆర్ఎస్ కు 714 ఓట్ల ఆధి క్యం లభించింది. వాస్తవానికి చౌటుప్పల్ లో 5 వేల మెజార్టీ వస్తుందని రాజగోపాల్ రెడ్డి భావించారు.
చండూరు మండలంపై కూడా రాజగోపాల్రెడ్డి భారీ ఆశలు పెట్టుకున్నారు. చండూరు మున్సిపాలిటీలో 24 వేల 995 ఓట్లు, రూరల్లో 31 వేల 333 ఓట్లున్నాయి. 8వ రౌండ్లో 532 ఓట్లు, 9వ రౌండ్లో 832 ఓట్లు, 10వ రౌండ్లో 484 ఓట్ల మెజార్టీతో ఈ మండలంలో అధికార టీఆర్ఎస్ హవా కొనసాగించింది. దీంతో బీజేపీ పెట్టుకున్న ఆశలు చండూరు లోనూ అడియాశలయ్యాయి.
ఏడో రౌండ్వరకు కొనసాగుతున్న టీఆర్ఎస్ ఆధిక్యాన్ని చండూరు ఓట్లతో దాటేయాలని బీజేపీ భావించింది. నిజానికి చండూరుకు చెందిన కాంగ్రెస్ నేతలు రాజగోపాల్ రెడ్డి వెంట బీజేపీ వెంట నడిచారు. మున్సిపాలిటీలో రాజగోపాల్ రెడ్డికి ఓటు బ్యాంక్ ఉంది. కానీ, గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం కమ్యూనిస్టుల ప్రభావం ఎక్కువ ఉంది. ఆ ఓట్లను టీఆర్ఎస్ క్యాష్ చేసుకుంది.
సంస్థాన్ నారాయణ పూర్ మండలంలోనూ మెజార్టీ వస్తుందని బీజేపీ ఆశించినా..టీఆర్ఎస్ కే ఆధిక్యం వచ్చింది. బీజేపీకి పట్టున్న ప్రాంతాలపై మొదటి నుంచీ టీఆర్ఎస్ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. అనుకున్నట్లుగా ప్రణాళికలను అమలు చేసి ఈ రెండు మండలాలను కైవసం చేసుకొని అంతిమంగా మునుగోడులో గులాబీ జెండా ఎగురవేసింది.