వంద మంది ఎమ్మెల్యేలను దించి 10 వేల ఓట్లతో గెలవడం గొప్పనా? అంటూ మునుగోడు ఉపఎన్నికలో టిఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందడంపై బీజేపీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్ ఎద్దేవా చేశారు. మునుగోడు మునుగోడులో విజయం సాధించామంటూ టీఆర్ఎస్ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారని, 10 వేల ఓట్లతో గెలవడం ఒక గెలుపేనా అని నిలదీశారు.
‘‘84 మంది ఎమ్మెల్యేలు, 16 మంది మంత్రులు, 15 మంది ఎమ్మెల్సీలు, 10 మంది ఎంపీలను, మొత్తం పోలీసు వ్యవస్థను మునుగోడులో మొహరించారు. కేసీఆర్ రెండు సార్లు బహిరంగ సభలు పెట్టారు. ప్రభుత్వ పథకాలు రాకుండా చేస్తామని టీఆర్ఎస్ నాయకులు ప్రజలను బెదిరించారు. బీజేపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డారు. వారిపై తప్పుడు కేసులు పెట్టారు. ఇన్ని చేసినప్పటికీ బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై 10,309 ఓట్ల మెజారిటీని మాత్రమే టీఆర్ఎస్ సాధించింది” అని ఆయన గుర్తు చేశారు.
రాష్ట్రంలో కేసీఆర్ పాలనపై రాష్ట్ర ప్రలజకు అసంతృప్తి ఉందని మునుగోడు ఫలితంతో స్పష్టమైందని తరుణ్ చుగ్ స్పష్టం చేశారు. మునుగోడులో కాంగ్రెస్ పార్టీ కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేక పోయిందని చెబుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పని అయిపోయిందని తెలిపారు. టీఆర్ఎస్ కు ప్రత్యమ్నాయం బీజేపీ మాత్రమేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని తరుణ్ చుగ్ ధీమా వ్యక్తం చేశారు.
అధికార దుర్వినియోగంతో స్వల్ప మెజారిటీతో టీఆర్ఎస్ గెలిచిందని, నైతిక విజయం మాత్రం తమదేనని తెలిపారు. కాగా, కేసీఆర్ మునుగోడులో ఇచ్చిన హామీలను 15 రోజుల్లోగా నెరవేర్చాలని తరుణ్ చుగ్ డిమాండ్ చేశారు.