వచ్చే నెల గుజరాత్లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి మెజారిటీ సాధిస్తే ఆ రాష్ట్రానికి భూపేంద్ర పటేల్ ముఖ్యమంత్రి కాగలరని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. గుజరాత్లో ఏడోసారి కూడా అధికారాన్ని దక్కించుకునేందుకు బిజెపి కన్నేసింది.
తొలిసారి ఎమ్యెల్యే అయినా భూపేంద్ర పటేల్ 2021 సెప్టెంబర్లో ముఖ్యమంత్రి విజయ్ రూపానీ స్థానంలో ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ఘట్లోడియా నియోజకవర్గం తొలి ఎంఎల్ఏ. ఆ సీటుకు ఆయన్నే మరోసారి నామినేట్ చేయడం జరిగింది.
కాగా, గుజరాత్లో ఎన్నికల రికార్డులను బద్దలు కొట్టి అఖండ మెజారిటీతో మరోసారి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. గుజరాత్ అభివృద్ధికి బీజేపీ అన్ని విధాలుగా కృషి చేసిందని చెబుతూ. ఈ విషయంలో తమ పార్టీ రాష్ట్ర ప్రజల అంచనాలను అందుకుందని తెలిపారు.
తాము కొన్ని సంవత్సరాలుగా బలమైన ప్రభుత్వంతో సురక్షితమైన, బాగా అభివృద్ధి చెందిన, విద్యావంతులైన గుజరాత్ను తయారు చేయాలనుకుంటున్నామని ఆయన తెలిపారు. ఈ క్రమంలో అనేక రంగాల్లో ప్రగతి సాధించామని చెప్పారు. అందుకే గుజరాత్ ప్రజలు బీజేపీకి మద్దతు ఇస్తున్నారని చెబుతూ రాబోయే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఓట్ల శాతం పెరుగుతుందని, సీట్లు కూడా పెరుగుతాయని చెప్పారు.
ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ దీనికి ముందు ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఇసుదాన్ గాధ్విని ప్రకటించారన్నది గమనార్హం. కాంగ్రెస్ పార్టీ మాత్రం తమ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నది ఇంత వరకు ప్రకటించలేదు. గుజరాత్లో 182 అసెంబ్లీ స్థానాలకు డిసెంబర్ 1, 5న రెండు దఫాలుగా ఎన్నికలు జరుగనున్నాయి. కాగా డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు జరుగనున్నది. గుజారాత్లో పోటీ ప్రధానంగా ఆప్, బిజెపి, కాంగ్రెస్ల మధ్య ఉండబోతుంది.