తాను ముందస్తు ఎన్నికలకు వెళ్ళబోతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని టిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు తోసిపుచ్చారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. పైగా, ప్రస్తుత ఎమ్యెల్యేలు అందరికీ వచ్చే ఎన్నికలలో తిరిగి సీట్లు ఇస్తామని కూడా హామీ ఇచ్చారు.
తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన జరిగిన టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధతతో పాటు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అంశంపై చర్చించారు. పార్టీ శ్రేణులంతా ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలను మార్చే ప్రసక్తే లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. మళ్లీ పాత వారికే టికెట్లు ఇస్తామని పేర్కొన్నారు. ఎన్నికలకు పది నెలల సమయమే ఉంది. పార్టీ శ్రేణులంతా ఎన్నికలకు సిద్ధం కావాలి. ప్రతి ఎమ్మెల్యే నిత్యం ప్రజలతో మాట్లాడాలి అని సూచించారు. ఏవైనా సమస్యలుంటే ప్రభుత్వం దృష్టికి తేవాలని కేసీఆర్ సూచించారు.
సర్వేలన్ని టీఆర్ఎస్కే అనుకూలంగా ఉన్నాయని కేసీఆర్ స్పష్టం చేశారు. వంద శాతం మళ్లీ టీఆర్ఎస్దే అధికారమని తేల్చిచెప్పారు. మునుగోడు తరహాలో పటిష్ట ఎన్నికల వ్యూహం తయారు చేయాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బాగా పని చేయాలి. అభివృద్ధి, సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
లబ్దిదారుల పూర్తి సమాచారం ఎమ్మెల్యేల వద్ద ఉండాలి. ఎమ్మెల్యేలు, కార్యకర్తలు నిత్యం ప్రజలతో మమేకం కావాలి. ప్రజలతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలి. టీఆర్ఎస్ కార్యకర్తల బలంతో ఓటర్లందరినీ చేరుకోవాలని కేసీఆర్ సూచించారు.
పార్టీ మారాలనుకుంటే జాగ్రత్త!
టీఆర్ఎస్ నేతలతో ఇతర పార్టీలకు చెందిన వారు ఎవరు టచ్ లోకి వచ్చినా తనకు సమాచారం ఇవ్వాలని సీఎం కేసీఆర్ చెప్పినట్లు తెలుస్తోంది. బీజేపీలో చేరాలని ఒత్తిడి తెస్తే ఆ విషయం తన దృష్టికి తేవాలని, ఒకవేళ చెప్పకపోయినా తనకు తెలిసిపోతుందని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ నేతలు పార్టీ మారాలని చూస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కేసీఆర్ హెచ్చరించారు.
ప్రతి ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడన్నది తనకు తెలిసిపోతుందని అందుకే జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఏమైనా సమస్యలుంటే మంత్రి కేటీఆర్కుగానీ ప్రగతి భవన్కు గానీ వచ్చి చెప్పుకోవాలని చెప్పినట్లు సమాచారం. కేంద్రానికి దర్యాప్తు సంస్థలుంటే మనకు కూడా దర్యాప్తు సంస్థలున్నాయని ఈ సందర్భంగా హెచ్చరించారు.
ఇడి దాడులు చేస్తే తిరగబడాలని, ఎక్కడ కేంద్ర సంస్థలు దాడులు చేస్తే అక్కడే ధర్నాలు చేయాలని కెసిఆర్ పిలుపునిచ్చారు.కేంద్రానికి జగన్ అనుకూలంగా ఉన్నప్పటికీ, తనని దెబ్బ తీసేందుకు కుట్ర చేశారని మండిపడ్డారు. ఇంతకంటే అన్యాయం ఏమైనా ఉంటుందా? అని అడిగారు.