తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఏర్పడబోయేది డబుల్ ఇంజన్ సర్కారేనని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే భరోసా వ్యక్తం చేశారు. వనపర్తి జిల్లా కేంద్రంలో జిల్లా అధ్యక్షులు రాజవర్ధన్రెడ్డి అధ్యక్షతన జరిగిన ‘నాగర్ కర్నూల్ లోక్ సభ ప్రవాస్ యోజన’ కోర్ కమిటీ సమావేశంలో మంత్రి మాట్లాడారు.
గతంలో దేశంలో మణిపూర్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, గోవా, అస్సాం, త్రిపుర తదితర రాష్ట్రాలలో ప్రతి ఎన్నికల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పడేవని, అయితే ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో అత్యధిక మెజార్టీతో రెండు, మూడవ పర్యాయాలు కూడా బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్తో అత్యధిక ప్రయోజనం పొందుతున్నారని ఆయన తెలిపారు.
రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని విమర్శించారు. ఇక్కడి ఎమ్మెల్యేలు మాఫియా డాన్ లలా మారి ప్రకృతినీ, ప్రజలనూ దోచుకుంటున్నారని కేంద్ర మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం ఆధ్వర్యంలోని ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకాన్ని పక్కన పెట్టి అన్యాయం చేసిందని పేర్కొంటూరాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో మాత్రమే అభివృద్ధి జరుగుతోందని స్పష్టం చేశారు.
నాగర్కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గంలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రూ.535 కోట్లు రైతుల ఖాతాలో జమ చేయడం జరిగిందని తెలిపారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద 883 కోట్ల 33 లక్షల నిధులు, కరోనా మహమ్మారి విపత్తుతో ఉపాధి కోల్పోయిన వీధి వ్యాపారులకు పీఎం స్వనిధి ద్వారా ఎలాంటి బ్యాంకు షరతులు లేకుండా ప్రతి వ్యాపారికి పదివేలు చొప్పున 12,864 మంది వ్యాపారులకు 12 కోట్ల 85 లక్షలు వీధి వ్యాపారులకు అందజేయడం జరిగిందని వివరించారు.
320 కిలో మీటర్ల జాతీయ రహదారుల నిర్మాణానికి 6100 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగిందని చెబుతూ దాదాపు 15 ఏళ్లుగా కొల్లాపూర్ ప్రజల చిరకాల స్వప్నమైన సోమశిల కృష్ణానది బ్రిడ్జి ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో రూ. 11 వేల కోట్లతో అత్యాధునికమైన మోడల్ వంతెన త్వరలోనే నిర్మాణం కాబోతుందని వెల్లడించారు. దీనివల్ల ఆంధ్ర, తెలంగాణ మధ్య 100 కిలో మీటర్ల దూరం తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు.
తాజాగా మునుగోడు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా నిలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిని ఓడించడానికి తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గం ఎంపీలు అధికార యంత్రాంగం పూర్తిగా కుమ్మక్కై ఓటు ఆరువేల రూపాయలు పంచినా చావు తప్పి కన్ను లొట్టబోయిన చందంగా పదివేల మెజార్టీతో గెలిచారని కేంద్ర మంత్రి గుర్తు చేశారు.
దీని ద్వారా తెలంగాణరాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి సరైన ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీయేనని తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారని స్పష్టమైనదని తెలిపారు. క్షేత్ర స్థాయిలో పార్టీని బలపరిచి రానున్న ఎన్నికల్లో డబుల్ ఇంజన్ సర్కారు ఏర్పాటు చేసి ప్రధాని నరేంద్ర మోదీకి కానుకగా ఇవ్వాలని ఆయన కార్యకర్తలకు సూచించారు.