ఎమ్మెల్యే కవిత ఫై బిజెపి ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా శుక్రవారం బంజారాహిల్స్ లోని అరవింద్ ఇంటిపై టిఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. ఇంట్లో అరవింద్ లేని సమయంలో కార్యకర్తలు పెద్ద ఎత్తున అరవింద్ ఇంటికి చేరుకొని , ఫర్నిచర్ ధ్వంసం చేశారు. పార్కింగ్ లో ఉన్న కార్ అద్దాలు ధ్వంసం చేశారు.
అర్వింద్ నివాసంలోకి చొరబడ్డ టీఆర్ఎస్ కార్యకర్తలు కిటికీల అద్దాలు పగులగొట్టారు. ఆయన ఇంటి ముందు దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ దాడి పట్ల అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ
కేసీఆర్, కేటీఆర్, కవిత ఆదేశాలతోనే నా ఇంటిపై దాడి జరిగిందని ఆరోపించారు. టీఆర్ఎస్ గూండాలు ఇంట్లో వస్తువులు పగులకొట్టి బీభత్సం సృష్టించారని అంటూ ఇంట్లో ఎవరూ లేనప్పుడు చూసి దాడి చేయడం తప్పు అని ధ్వజమెత్తారు. కవితకు ఇంత కుల అహంకారం ఎందుకు? అని నిలదీశారు.
టీఆర్ఎస్ పార్టీ నేతల దాడులకు తామ అస్సలు భయపడబోమని స్పష్టం చేశారు. నీ అయ్యను చెప్పుతో కొట్టానా..నువ్వు నన్ను ఎందుకు కొడతావని కవితకు అరవింద్ కౌంటర్ ఇచ్చారు. ఇంట్లో ఉన్న తన తల్లిని బెదిరించారని అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పిచ్చిపిచ్చిగా మాట్లాడితే చెప్పుతో కొడతా.
ఎంపీ అర్వింద్ ఇంకోసారి పిచ్చిపిచ్చిగా మాట్లాడితే చెప్పుతో కొడతానని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. మీడియాతో ఆమె మాట్లాడుతూ నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడతానని స్పష్టం చేశారు.కుక్కకాటుకు చెప్పు దెబ్బ తప్పదని చెప్పారు. తాను ఖర్గేతో మాట్లాడి కాంగ్రెస్ లో చేరుతానని అన్నానా అని ప్రశ్నించారు. నువ్వే వాళ్లతో టచ్ లో ఉన్నావన్నారు. ఇంకోసారి ఇలా మాట్లాడితే కొట్టి కొట్టి చంపుతామని ధ్వజమెత్తారు.
ఆడబిడ్డ అని కూడా చూడకుండా తనపై వ్యాఖ్యలు చేశారని.. మొన్నటి వరకు ఒపిక పట్టామని.. ఇకపై చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. తాను బాధతో మాట్లాడాల్సి వచ్చిందని చెప్పారు. తాను ఇప్పటి వరకు ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శించలేదని.. అర్వింద్ రాజకీయాలు చేయాలి కాని.. పిచ్చి వేషాలు వేయకూడదని హితవు చెప్పారు. ఆయన కాంగ్రెస్తో కలిసి గెలిచారని పేర్కొంటూ ఆయన ఎక్కడ పోటీ చేసిన వెంబడించి మరీ ఓడిస్తామని స్పష్టం చేశారు.
బండి సంజయ్, అరుణ ఆగ్రహం
బిజెపి ఎంపీ అరవింద్ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడిని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొనే దమ్ము లేక భౌతిక దాడులకు దిగి రౌడీయిజం చేస్తారా అంటూ నిలదీశారు. అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ములేని దద్దమ్మలు దాడులతో ప్రశ్నించే గొంతును నొక్కాలనుకుంటున్నరని…గడీల గూండాల దాడులకు… తోక ఊపులకు భయపడతామనుకుంటున్నారా? అని ప్రశ్నించారు.
బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్రంగా ఖండించారు. అర్వింద్ నివాసంపై టీఆర్ఎస్ గుండాలు దాడి చేయడం సిగ్గుచేటని ఆమె మండిపడ్డారు. బీజేపీ కార్యకర్తలు కేవలం ధర్నాకు సిద్ధమైతేనే అరెస్ట్ చేసి కేసులు నమోదుచేసే పోలీసులు మరి ఇప్పుడేం కేసులు బుక్ చేస్తారో చెప్పాలని నిలదీశారు. ఈ దాడికి ప్రధాన కారకురాలైన ఎమ్మెల్సీ కవితపై కూడా పోలీసులు కేసు నమోదుచేయాలని డీకే అరుణ డిమాండ్ చేశారు. ఎంపీ ధర్మపురి అర్వింద్ కుటుంబానికి టీఆర్ఎస్ నుంచి ప్రాణహాని ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. ఆయన ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి దిగడం దీనికి సంకేతమని పేర్కొన్నారు.