అసోమ్, మేఘాలయ సరిహద్దులో జరిగిన కాల్పుల ఘటనపై మేఘాలయ ప్రభుత్వం అప్రమత్తమైంది. పశ్చిమ జైంతియా హిల్స్ లోని ముక్రోహ్ లో మంగళవారం జరిగిన కాల్పుల్లో అస్సాం అటవీ అధికారి సహా.. మేఘాలయకు చెందిన ఐదుగురు మరణించారు. ఈ ఘటనలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించిన చికిత్స అందిస్తున్నారు. ఘటనపై మేఘాలయ పోలీసులు కేసు నమోదు చేశారని ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా తెలిపారు.
ఈ ఘటనపై వదంతులు ప్రచారం చేసే అవకాశం ఉందని మేఘాలయ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను 48 గంటలపాటు నిలిపివేసింది. ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉద్రిక్తతలు చల్లారటం లేదు. ఇవాళ ఉదయం అక్రమ కలప రవాణా చేస్తున్న ట్రక్కును అడ్డగించడంతో అస్సాం -మేఘాలయ సరిహద్దులో హింస చెలరేగింది.
అసోం పరిధిలోని పశ్చిమ కర్బీ అంగ్లాంగ్ జిల్లాలోని ముక్రు ప్రాంతంలో.. అర్ధరాత్రి 3 గంటల ప్రాంతంలో.. మేఘాలయలోని పశ్చిమ జైంటియా హిల్స్ జిల్లా ముఖో వైపు అక్రమంగా కలప తరలిస్తున్న టింబర్ను అసోం అటవీ శాఖ బృందం అడ్డుకుంది. ఈ క్రమంలో వాళ్లు పారిపోయే ప్రయత్నం చేయగా.. పలువురిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటన తర్వాత ఫారెస్ట్ సిబ్బంది జిరికెండింగ్ పోలీస్ స్టేషన్కు సమాచారం అందజేశారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని భద్రతను పెంచారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్న తర్వాత.. మేఘాలయ నుంచి ఆయుధాలతో పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడకు వచ్చారు.
అరెస్టు చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. ఫారెస్ట్ గార్డులు, పోలీస్ సిబ్బందిపై దాడి చేశారు. ఈ క్రమంలోనే పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి కాల్పులు జరపాల్సి వచ్చిందని అస్సాం పోలీసులు వివరణ ఇచ్చారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉండగా.. మేఘాలయ సరిహద్దు పంచుకుంటున్న జిల్లాల్లో అసోం పోలీసులు భద్రతను పెంచారు.
1972లో మేఘాలయ అస్సాం నుండి వేరు అయ్యింది. అప్పటి నుంచి అస్సాం పునర్వ్యవస్థీకరణ చట్టంపై చర్చ నడుస్తూనే వస్తోంది. ఇరు రాష్ట్రాలు గతేడాది ఆగస్టులో మూడు ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుని.. ఈ సమస్య పరిష్కారానికి సిద్ధం అయ్యాయి. ఇరు రాష్ట్రాల సీఎంలు.. ఓ డ్రాఫ్ట్ రెజల్యూషన్ను హోం మంత్రి అమిత్ షాకు జనవరి 31వ తేదీన సమర్పించాయి.