తెలంగాణ బీజేపీ నేతలుబుధవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తదితర నేతలు హస్తినకు వెళ్తున్నారు. వారితో పాటు కాంగ్రెస్ కు రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి కూడా దేశ రాజధానికి వెళ్లనున్నారు.
25న (శుక్రవారం రోజు) బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో చేరనున్నారు. ఈ సందర్భంగా, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ కు సిట్నోటీసులు, తాజా రాజకీయ పరిణామాలపై ఢిల్లీ పెద్దలతో రాష్ట్ర బిజెపి నేతలు చర్చించే అవకాశం ఉంది .
కాగా, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్న సందర్భంగా తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీకి క్యాన్సర్ సోకిందని, అది నయం చేయలేని స్థితికి చేరుకుందని శశిధర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే పరిస్థితి కాంగ్రెస్ కు లేదని స్పష్టం చేస్తూ, అటువంటి సత్తా బిజెపికి మాత్రమే ఉన్నట్లు ప్రకటించారు.
రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వద్దని తాను అధిష్టానానికి సూచించానని, తెలంగాణ పార్టీ పరిస్థితులపై మూడేళ్ల క్రితమే అధిష్టానానికి చెప్పానని, అయినా అధిష్టానం పట్టించుకోలేదని పేర్కొన్నారు. ‘‘రేవంత్ వ్యవహార శైలి సరిగ్గా లేదు. ఆయన తీరు వల్లే ఈరోజు చాలా మంది కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారు.
రేవంత్ వైఖరి వల్ల తెలంగాణలో కాంగ్రెస్ ఉనికిని కోల్పోతున్నది” అంటూ పార్టీ జాతీయ నాయకత్వాన్ని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఆయన అందుబాటులో ఉండడని, తన వర్గం వారితో, చెంచాగాళ్లతో పార్టీని నడిపిస్తున్నాడని ధ్వజమెత్తారు. డబ్బు ఖర్చు పెట్టకపోతే టికెట్లు, పదవులు ఇవ్వనని బెదిరిస్తున్నాడని ఆరోపించారు.
వచ్చే ఎన్నికల్లో 15 మందిని గెలిపించుకొని తన సొంత దుకాణం నడిపించుకోవాలని రేవంత్ భావిస్తున్నాడని మండిపడ్డారు. రేవంత్ తనకంటూ ప్రత్యేక కోటరీని ఏర్పాటు చేసుకుని పార్టీని నడిపిస్తున్నాడని అంటూ పార్టీలో చాలా మంది అసంతృప్తితో ఉన్నారని స్పష్టం చేశారు. పీసీసీ చీఫ్లకు ఇంఛార్జ్లు ఏజెంట్లుగా మారిపోయారని, ఇదే కాంగ్రెస్ పార్టీకి పెద్ద మైనస్ అని శశిధర్ రెడ్డి హెచ్చరించారు.