ఖమ్మం జిల్లా రఘనాథపాలెం మండలంలోని ఈర్లపూడికి చెందిన ఫారెస్ట్ అధికారి శ్రీనివాసరావు హత్యకు ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యుడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. తక్షణమే సీఎం కేసీఆర్ పై హత్య కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పోడు భూముల సమస్యను పరిష్కస్తానని, కుర్చీ వేసుకుని పోడు రైతులకు పట్టాలిస్తానని అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు.
మళ్లీ అధికారులను పంపి దాడులు చేయించేది కేసీఆరే అంటూ పంట చేతికొచ్చే సమయానికి దాడులు చేసి పంటను నాశనం చేయించేది కేసీఆర్ అని ధ్వజమెత్తారు. సమస్యను పరిష్కరించకుండా కేంద్రాన్ని బదనాం చేయడమే పనిగా పెట్టుకున్నడని మండిపడ్డారు. సీఎం కుట్రలకు అధికారులను బలి చేస్తున్నారని, బీజేపీ నేతలకు నోటీసులతో బెదిరింపులకు దిగుతూ రాజకీయ లబ్ది పొందాలనుకుంటున్నడని పేర్కొంటూ తన పదవిని కాపాడుకునే యత్నం చేస్తున్నడని విమర్శించారు.
కేసీఆర్ కుటుంబంపై వస్తున్న అవినీతి ఆరోపణలపై ప్రజల ద్రుష్టిని మళ్లించేందుకు ఆడుతున్న డ్రామా అని స్పష్టం చేశారు. లిక్కర్ స్కాంపై కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదు? అని ప్రశ్నించారు. సీఎం, ఆయన కుటుంబం, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజల సొమ్మును దోచుకుని అడ్డంగా దోచుకుంటున్నరని, ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు.
ఐటీ, సీబీఐ, ఈడీ దాడులపై రాజకీయ విమర్శలు చేయడం సిగ్గు చేటని కొట్టిపారవేసారు. ప్రజలను రాచిరంపాన పెట్టి అడ్డగోలుగా, అక్రమంగా ఆస్తులు సంపాదించిన వాళ్లను కంట్రోల్ చేయాలా? వద్దా? రాజకీయ విమర్శలు చేసే వాళ్లు సమాధానం చెప్పాలని నిలదీశారు అక్రమార్కులను పార్టీలకు అపాదించడం కరెక్ట్ కాదని అంటూ అక్రమార్కుల మీద దాడులు చేస్తే అడ్డుకోవడమేంది? అని ప్రశ్నించారు.
అధికారులు తనిఖీలు చేస్తే నిజాయితీని నిరూపించుకునే అవకాశం ఉందని చెప్పారు. అది చేతగానివాళ్లే బూతులు తిడుతూ దాడులు చేస్తూ రాజకీయ రంగు పులుమతారని దుయ్యబట్టారు . అవినీతి తిమంగలాలను వదిలిపెట్టాలా? అని విస్మయం వ్యక్తం చేశారు.
అవినీతి పరులు తప్పించుకోవడానికి ఏదో ఒక విమర్శలు చేయడం సిగ్గు చేటని మండిపడ్డారు. సీబీఐ, ఈడీ, ఐటీ శాఖలు స్వయం ప్రతిపత్తి గల సంస్థలని పేర్కొంటూ బీజేపీ ఎంపీపైనా కూడా దాడులు చేశారు కదా… వాటికి పార్టీలతో పనిలేదని స్పష్టం చేశారు.