సీనియర్ కాంగ్రెస్ నేత మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి శుక్రవారం బిజెపిలో చేరారు. ఢిల్లీలోని బిజెపి కేంద్ర కార్యాలయంలో కేంద్ర మంత్రులు శర్బానంద సోనోవాల్, కిషన్ రెడ్డి సమక్షంలో ఆయన బిజెపి కండువా కప్పుకున్నారు.
మర్రి శశిధర్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించిన కేంద్ర మంత్రి శర్బానంద సోనోవాల్, ఆయన చేరికతో తెలంగాణలో పార్టీ మరింత బలోపేతమవుతుందని, టీఆర్ఎస్ కుటుంబ పాలన అంతమవుతుందని చెప్పారు.
అనంతరం మర్రి శశిధర్ రెడ్డితో కలిసి నేతలందరూ బీజేపీ జాతీయాధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా నివాసానికి చేరుకున్నారు. అక్కడ జరిగిన మర్యాదపూర్వక భేటీలో అధ్యక్షులు జేపీ నడ్డా కూడా మర్రి శశిధర్ రెడ్డికి మరోసారి కండువా కప్పి పుష్పగుచ్ఛాన్ని అందజేశారు. అనంతరం నేతలు అరగంటకు పైగా తెలంగాణ తాజా రాజకీయ పరిస్థితుల గురించి చర్చించుకున్నారు
తర్వాత మీడియాతో మాట్లాడుతూ ‘తెలంగాణలో కాంగ్రెస్ పనైపోయింది. టిఆర్ఎస్ను ఎదుర్కొనడం కాంగ్రెస్ వల్ల కాదు’ అని పేర్కొన్నారు. ఆయన తెలంగాణ అభివృద్ధి, కుటుంబ పాలన విషయంలో ముఖ్యమంత్రి కెసిఆర్పై విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ను ఎదుర్కోగల సత్తా బిజెపికి మాత్రమే ఉన్నదని స్పష్టం చేశారు.
ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షాను శశిధర్ రెడ్డి కలిశాక, ఆయనను కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించగా, ఆ తర్వాత ఆ పార్టీకి రాజీనామా చేస్తూ మర్రి శశిధర్ రెడ్డి కాంగ్రెస్ నేతలపై అనేక ఆరోపణలను చేశారు.
రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్కం ఠాగూర్పై ఆయన చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ నాయకుడు, మాజీ విప్ ఈరవత్రి అనిల్ డిమాండ్ చేశారు. పరువు నష్టం కేసును ఎదుర్కొనాల్సి ఉంటుందని లీగల్ నోటీస్ కూడా పంపించారు.