మునుగోడు ఉపఎన్నిక ఫలితం రాగానే అధికార టిఆర్ఎస్ లో ప్రకంపనాలు తధ్యమని, ఆ పార్టీకి చెందిన పలువురు శాసనసభ్యులు బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పుకొంటూ వచ్చిన బిజెపి నేతలు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నేతల వైపు దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తున్నది.
రెండు తరాలుగా కాంగ్రెస్ కుటుంభం నేపధ్యం గల మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి చేరికతో ఉత్సాహంతో ఉన్న బిజెపి నేతలు మరి కొంతమంది నేతలను కూడా చేర్పించుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు.
కనీసం పది మంది సీనియర్ కాంగ్రెస్ నేతల పట్ల బిజెపి ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతున్నది. వారిలో ఐదు మంది వరకు త్వరలో చేరే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. పిసిసి అధ్యక్షడు రేవంత్ రెడ్డి నాయకత్వం పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న కాంగ్రెస్ సీనియర్లను ఆకర్షించే పనిలో బిజెపి నేతలున్నారు.
అయితే ఈ ప్రమాదాన్ని పసిగట్టిన కాంగ్రెస్ అధిష్ఠానం శశిధర్ రెడ్డి బాటలో మరికొందరు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్న సమాచారంతో అప్రమత్తమైన్నట్లు చెబుతున్నారు. పీసీసీ కొత్త కార్యవర్గంతో పాటు పొలిటికల్ అఫైర్స్ కమిటీ కూర్పు కోసం కసరత్తు చేపట్టింది. తద్వారా వలసలను అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నారు.
తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ తమ సొంత బలం సరిపోదని, 20 నుండి 30 నియోజకవర్గాలకు మించి పోటీ చేయడానికి బలమైన అభ్యర్థులు లేరని బీజేపీ అధిష్టానం నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తున్నది. అందుకనే బలమైన ఇతర పార్టీల నేతలను ఆకర్షించడం కోసం మాజీ మంత్రి ఈటెల రాజేందర్ నాయకత్వంలో `చేరికల కమిటీ’ని కూడా ఏర్పాటు చేశారు.
అయితే ఎమ్యెల్యేల కొనుగోలు కేసులో బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బి ఎల్ సంతోష్ తో పాటు పలువురు బిజెపి నేతలను అరెస్ట్ చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుండడంతో ఇప్పటిలో టీఆర్ఎస్ ఎమ్యెల్యేలు ఎవ్వరిని సంప్రదించే అవకాశాలు కనిపించడం లేదు.
అయితే, ఇందుకు నేతలు చెబుతున్న కారణం మాత్రం మరోలా ఉంది. సిట్టింగ్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, అలాంటివారిని చేర్చుకుంటే బీజేపీ వచ్చే ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువని భావిస్తున్నారు.
అయితే ఎన్నికలు సమీపించినప్పుడు టికెట్ ఆశించి దక్కించుకోలేక పోయిన బలమైన నేతలు మాత్రం బీజేపీకి ఉపయోగపడతారని ధీమాతో ఉన్నారు. వేసుకుంటోంది. ఆ తరహా నేతలు తమంతట తాముగా ముందుకు వచ్చినప్పుడు చేర్చుకునే విషయాన్ని ఆలోచించవచ్చని భావిస్తున్నారు.