ఐదవ విడత ప్రజా సంగ్రామ యాత్రను సోమవారం ప్రారంభించడం కోసం కరీంనగర్ నుండి బయలుదేరిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ కు అకస్మాత్తుగా, ఆదివారం రాత్రి మార్గమధ్యలో అనుమతి రద్దు చేస్తున్నట్లు చెబుతూ, అడ్డుకొని, అరెస్ట్ చేసి, కరీంనగర్ కు తీసుకు వచ్చి వదిలిపెట్టారు. దానితో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
భైంసాలో ప్రజా సంగ్రామ యాత్రకు అనుమతిని రద్దు చేయడంపై సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందు అనుమతిచ్చి ఇప్పుడు హఠాత్తుగా రద్దు చేయడం ఏంటని పోలీసులను ప్రశ్నించారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ హాజరవుతున్న ప్రారంభ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన, రూట్ మ్యాప్ కూడా ప్రకటించాక అనుమతి నిరాకరించడం దారుణమని ఆయన మండిపడ్డారు.
భైంసా ఏమైనా నిషేధిత ప్రాంతమ? అక్కడికి ఎందుకు వెళ్లొద్దని ప్రశ్నించారు. భైంసానే కాపాడలేని ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని ఏం కాపాడుతారని విమర్శించారు. సీఎంకు చేతకాకపోతే ఇంట్లో కూర్చోవాలని మండిపడ్డారు. సోమవారం మధ్యాహ్నం వరకు తమకు సమయం ఉందని, అప్పటివరకు వేచి చూస్తామని చెప్పారు. గొడవలు జరగకుండా సజావుగా యాత్ర జరిగేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
భైంసా వేరే దేశంలో ఉందా? భైంసా వెళ్లాలంటే వీసా తీసుకోవాలా? అని సంజయ్ ప్రశ్నించారు. భైంసాను ప్రత్యేక దేశం చేసి ఓవైసీ కుటుంబానికి అప్పజెబుతున్నారా అని ఎద్దేవా చేశారు. భైంసా సున్నితమైన ప్రాంతమని పోలీసు అధికారులు ఇప్పుడు హఠాత్తుగా చెబుతున్నారని, తాము అనుమతి కోరినప్పుడు సున్నితమైన ప్రాంతమనేది గుర్తుకురాలేదా? అని నిలదీశారు. భైంసాలో 3 రోజుల నుంచి బహిరంగ సభ వేదిక ఏర్పాట్లను పోలీసు అధికారులు పర్యవేక్షిస్తున్నప్పడు ఈ ముఖ్యమంత్రికి గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు.
‘‘నిర్మల్ లో ఉన్న బీజేపీ కార్యకర్తలను పోలీసులు కొట్టుకుంటూ హోటల్లో నుంచి ఖాళీ చేయిస్తున్నారు. ఎస్పీ గారిని కలవడానికి వెళ్తే కార్యకర్తలను ఎస్పీ ఆఫీసులోనే పోలీసులు అరెస్టు చేశారు. ఎస్పీ ఆఫీసుకు పోయే హక్కు కూడా బీజేపీ కార్యకర్తలకు లేదా ?” అంటూ సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణలో రాచరికపు పాలన నడుస్తోందని మండిపడుతూ వెంటనే కార్యకర్తల పై దాడులు ఆపి, అరెస్టు అయిన కార్యకర్తలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా సంగ్రామ యాత్రకు వెళ్ళడానికి అనుమతి ఇవ్వండి. ఇవ్వకపోతే దాని పరిమాణాలు వేరే ఉంటాయని హెచ్చరించారు. “నేను ఎట్టి పరిస్థితుల్లో రేపు సభకు వెళ్లి తీరుతా.- పోలీసుల తీరుపై న్యాయస్థానం తలుపు తడతాం” అని స్పష్టం చేశారు.
సోమవారం మధ్యాహ్నం వరకూ సంజయ్ కరీంనగర్ లోని జ్యోతి నగర్ లో ఉన్న అత్తగారి నివాసం వద్ద ఉండనున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
కాగా, సంజయ్ పాదయాత్రకు పోలీసులు అనుమతిని రద్దు చేయడం పిరికిపంద చర్యే అని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ధ్వజమెత్తారు. ఓటమి భయంతోనే కేసీఆర్ ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆమె మండిపడ్డారు. తెలంగాణలో బీజేపీ బలపడుతుండటాన్ని కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారని ఆమె చెప్పారు. పోలీసులు ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.