దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి పూర్తిగా అదుపులోనే ఉంది. రోజురోజుకూ కొత్త కేసులు గణనీయంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా దేశంలో 215 కొత్త కేసులు నమోదైనట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కాగా, ఇది గత రెండేళ్లలో ఒక రోజులో నమోదైన కనిష్ఠ కొత్త కేసులు కావడం విశేషం. 2020 ఏప్రిల్ తర్వాత ఇంత తక్కువ సంఖ్యలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.
తాజా కేసులతో దేశంలో వైరస్ బారిన పడిన వారి సంఖ్య 4,46,72,068కి చేరింది. ఇక ఇప్పటి వరకు వైరస్ నుంచి 4,41,36,471మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 4,982 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. గత 24 గంటల్లో వైరస్ కారణంగా ఒకరు మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 5,30,615కి చేరినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
మొత్తం కేసుల్లో 0.01శాతం కేసులు యాక్టివ్గా ఉన్నాయని, రికవరీ రేటు 98.80శాతం, మరణాలు 1.19శాతంగా ఉందని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 219.91 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు వెల్లడించింది.
ఇలా ఉండగా, కరోనా రక్షక టీకా తీసుకున్న తర్వాత ఏవైనా తీవ్ర దుష్ప్రభావాలు ఎదురైతే అందుకు తమ బాధ్యత ఉండబోదని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కరోనా టీకా తీసుకున్న వ్యక్తి మరణించినట్లయితే సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసి పరిహారం కోరడమే మార్గమని పేర్కొంది. కరోనా వ్యాక్సినేషన్ను ప్రజాప్రయోజనాల దృష్టా ప్రభుత్వం ప్రోత్సహించిందని, టీకాలు వేయడానికి చట్టపరమైన బలవంతం ఏమీ లేదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది.
గతేడాది కరోనా టీకా తీసుకున్న అనంతరం ఇద్దరు వేర్వేరు యవతులు మరణించారు. దీంతో వారి తల్లిదండ్రులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనికి స్పందనగా కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ వేసింది. కరోనా టీకాలు తీసుకున్న అనంతరం చోటు చేసుకున్న మరణాలపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని పిటిషనర్లు కోరారు. టీకాలు తీసుకున్న తర్వాత తీవ్ర దుష్ప్రభావాలు ఎదురైతే వెంటనే గుర్తించి సత్వర చికిత్స అందించే ప్రోటోకాల్ కోసం డిమాండ్ చేశారు.
ఈ మరణాలు కరోనా టీకాల వల్లేనని ఈ ఒక్క కేసులోనే నేషనల్ ఏఈఎఫ్ఐ కమిటీ గుర్తించినట్టు పేర్కొంది. జరిగిన నష్టంపై సివిల్ కోర్టును ఆశ్రయించి, పరిహారం కోరే హక్కు ఉంటుందని స్పష్టం చేసింది. ఇది విషాదకరమైనా ప్రభుత్వం మరణాలకు బాధ్యత వహించదని ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.