ఇంటి జాగా ఉన్న వాళ్లందరికీ రూ.5 లక్షలిస్తామంటూ అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ మాట తప్పి రూ.3 లక్షలే ఇస్తానంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. మాట తప్పి తప్పు చేశానంటూ కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా చెంపలేసుకుని ప్రజలను క్షమాపణ కోరాలని ఆయన సూచించారు.
ఇండ్ల జాగా ఉన్న వాళ్లందరికీ డబ్బులిచ్చేదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తెలంగాణలో ఇండ్ల నిర్మాణం కోసం కేంద్రం రూ.4 వేల కోట్లకుపైగా నిధులిస్తే ఆ సొమ్మును దారి మళ్లించిన ఘనుడు కేసీఆర్ అని విమర్శించారు. ఆ నిధుల సంగతేమైందని కేంద్ర మంత్రి లేఖ రాసినా స్పందన లేదని చెప్పారు. గత ఎన్నికల్లో కేసీఆర్ ఇచ్చిన హామీలేవీ అమలు కాలేదని మండిపడ్డారు.
రుణమాఫీ, డబుల్ బెడ్రూం, నిరుద్యోగ భ్రుతి, దళిత, గిరిజనులకు 3 ఎకరాలు సహా ఎన్నో హామీలిచ్చి అమలు చేయలేదని గుర్తు చేశారు. ఎన్నికల గడువు దగ్గర పడుతుండటంతో మళ్లీ కేసీఆర్ కొత్త డ్రామాలకు తెరదీశారని ఆరోపించారు. 80 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించినా ఇంతవరకు ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదని చెప్పారు.
3వ రోజు పాదయాత్రలో భాగంగా ముథోల్ నియోజకవర్గంలోని మహాగాంకు వచ్చిన సంజయ్ కు ప్రజలు అక్కడి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ మహాగాం గ్రామ సమస్యలను పరిష్కరించలేనోడు… దేశ సమస్యలను పరిష్కరిస్తాడా?.అని ప్రశ్నించారు. చెల్లని రూపాయికి గీతలు ఎక్కువ, కేసీఆర్ నోటికి మాటలు ఎక్కువ అంటూ కేసీఆర్ ఇంట్లో ముఖ్యమంత్రి పీఠం కోసం లొల్లి స్టార్ట్ అయిందని ధ్వజమెత్తారు.
మహారాష్ట్రలో ఒక్కరోజే లక్ష గృహప్రవేశాలు చేసిన చరిత్ర బిజెపి అని చెప్పారు. ప్రజలను మోసం చేస్తున్న మూర్ఖుడు కేసీఆర్ అంటూ తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా బిజెపినే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బిజెపి అధికారంలోకి వచ్చాక, నిలువు నీడలేని పేదలకు ఇండ్లను కట్టించే బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఎన్నికలప్పుడు తప్పుడు హామీలతో ఓట్లు వేయించుకుంటాడు. ఆ తర్వాత లా పత్తా లేకుండా పోతాడని సంజయ్ హెచ్చరించారు. అసెంబ్లీ సమావేశాలను పెట్టి కేంద్ర ప్రభుత్వాన్ని వెంటాడుతాడట. దమ్ముంటే అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలను చర్చించాలని సవాల్ చేశారు. గ్రామ పంచాయతీలకు నేరుగా నిధులను ఇస్తున్నది కేంద్ర ప్రభుత్వమే. గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులన్నీ… కేంద్రం ఇస్తున్న నిధులతోనే అని చెప్పారు.
గురుకుల పాఠశాలల్లో పురుగుల అన్నం, విషపన్నం పెడుతున్నారని అంటూ బాసర ఐఐఐటిలో సమస్యల పరిష్కారం కోసం విద్యార్థులు రోడ్డుకెక్కిన పరిస్థితి ఏర్పడినది పేర్కొన్నారు.