కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ కి భార్య సునందా పుష్కర్ మృతి కేసులో ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 2014 జనవరి 17న ఢిల్లీలోని ఒక లగ్జరీ హోటల్లో సునంద అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.
హత్య అనే కోణంలో తొలుత దర్యాప్తు జరిగింది. ఆ తర్వాత ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. అయితే ఆమె ఆత్మహత్య చేసుకునేలా శశి థరూర్ ప్రేరేపించారనే అభియోగాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆయనను ప్రధాన నిందితుడిగా పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు 2021 ఆగస్టులో ఆయనపై నమోదైన అభియోగాలను కొట్టివేసి, ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చింది. అయితే, పటియాలా హౌస్ కోర్టు ఇచ్చిన తీర్పును ఢిల్లీ హైకోర్టులో పోలీసులు సవాల్ చేశారు. ఈ పిటిషన్ ను స్వీకరించిన హైకోర్టు థరూర్ కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 2023 ఫిబ్రవరి 7వ తేదీకి వాయిదా వేసింది.
ఈ కేసులో శశిథరూర్కు ఊరట లభించిన దాదాపు 15 నెలల తర్వాత ఢిల్లీ పోలీసులు తీర్పుపై రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ ఆలస్యానికి క్షమించాలని ఢిల్లీ పోలీసులు న్యాయస్థానానికి అప్పీల్ చేసుకున్నారు. ఈ అప్పీల్ను పరిశీలించిన కోర్టు.. తాజాగా శశిథరూర్కు నోటీసులు జారీ చేసింది.