గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి రికార్డు స్థాయిలో, ఇప్పటి వరకు రాష్ట్ర చరిత్రలో మరే పార్టీ సాధింపలేనన్ని సీట్లను గెల్చుకొని, వరుసగా ఏడవసారి అధికారంలోకి వస్తుండగా, హిమాచల్ ప్రదేశ్ లో అధికార ఓటమి సంప్రదాయాన్ని కొనసాగిస్తూ అధికారంలో ఉన్న బిజెపిని ఓడించి, కాంగ్రెస్ మెజారిటీ సీట్లు సంపాదించింది.
గుజరాత్ లో బిజెపి 156 సీట్లు గెల్చుకోవడంతో రాష్ట్ర ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ రెండోసారి అధికారం చేపట్టనున్నారు. ఈనెల 12వ తేదీన ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, హోంశాఖ మంత్రి అమిత్షాలు హాజరుకానున్నారు. కాగా, కాంగ్రెస్ 17స్థానాల్లో, ఆప్ 5 స్థానాలకు పరిమితమయ్యాయి. గుజరాత్ చరిత్రలోనే ఈ స్థాయి సీట్లు ఎవరికీ ఎప్పుడూ రాలేదు. గుజరాత్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. 1985లో కాంగ్రెస్ పార్టీ 149 సీట్లను సాధించింది. ఇప్పుడా రికార్డును బీజేపీ బద్ధలు కొట్టబోతోంది.
హిమాచల్లో కాంగ్రెస్ 39 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందగా, బిజెపి 26, ఇతరులు 3 స్థానాలను గెలుచుకున్నారు. రాష్ట్రంలోని మొత్తం 68 అసెంబ్లీ స్థానాలకు గాను ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మేజిక్ ఫిగర్ 35ను కాంగ్రెస్ దాటేసింది. అయితే తమ ఎమ్యెల్యేలను కాపాడుకోవడం కోసం శిబరంకు గెలుపొందిన వారిని తరలిస్తున్నారు.
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రభావంతోనే హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిందని ప్రకటించిన ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గుజరాత్ ఫలితాల గురించి నిస్తేజంగా మాట్లాడారు. “గుజరాత్లో ఓటమిని అంగీకరిస్తున్నాం. గెలిచిన వారికి అభినందనలు. ప్రజాస్వామ్యంలో గెలుపు, ఓటములు శాశ్వతం కాదు. ఎక్కడెక్కడ లోపాలుంటే వాటిని సరిదిద్దుకుని పోరాడుతూనే ఉంటాం” అని తెలిపారు. వాస్తవానికి రాహుల్ హిమాచల్ లో ప్రచారం చేయనే లేదు. గుజరాత్ లో రెండు రోజులు ప్రచారంలో పాల్గొన్నారు.
కాగా, హిమాచల్ ప్రదేశ్ సీఎం పదవికి జైరాం ఠాకూర్ రాజీనామా చేశారు. గవర్నర్ని కలిసి రాజీనామా లేఖను సమర్పించారు. పదవిలో లేకున్నా ప్రజల కోసం ఎప్పుడూ పనిచేస్తామని ఆయన చెప్పారు. కొన్ని అంశాలు తమ ఓటమికి కారణమయ్యాయని.. వాటిని విశ్లేషించుకుంటామని తెలిపారు. 35 ఏళ్ల హిమాచల్ ఎన్నికల చరిత్ర చూస్తే… ఇక్కడ ఏ పార్టీ కూడా వరుసగా రెండు సార్లు గెలవలేదు. ఒకసారి బీజేపీ గెలిస్తే.. ఒకసారి కాంగ్రెస్ గెలుస్తూ వచ్చింది. ఈసారి కూడా అదే సెంటిమెంట్ రిపీట్ అయింది. అధికార పార్టీ బీజేపీకి షాకిచ్చిన ప్రజలు.. కాంగ్రెస్కి పట్టం గట్టారు.