గుజరాత్ ఎన్నికల ఫలితాలతో తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావుకు నిద్రపట్టదని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు స్పష్టం చేశారు. బీజేపీని అణిచేస్తామని కేసీఆర్ ప్రగర్భాలు పలికారని, కానీ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూస్తే ఆయనకు నిద్ర కూడా పట్టదని జీవీఎల్ ఎద్దేవా చేశారు.
ఈ ఫలితాలతో ముందస్తు ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచన కూడా విరమించుకుంటారేమో అని పేర్కొన్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లి ఓటమిపాలవడం కంటే పదవీకాలం పూర్తయ్యేవరకైనా అధికారాన్ని అనుభవిద్దామనుకుంటారని జీవీఎల్ తెలిపారు. తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి ఖాయమని, ఆ పార్టీకి ప్రత్యామ్నాయంగా ప్రజలు బీజేపీ వైపే చూస్తున్నారని సూత్రీకరించారు. ఇందుకు మునుగోడు ఉపఎన్నికల ఫలితాలే నిదర్శనమని చెప్పారు.
2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ బీజేపీ గుజరాత్ తరహాలోనే రికార్డు స్థాయి మెజారిటీ సాధిస్తుందని జీవీఎల్ ధీమా వ్యక్తం చేశారు. 2019లో సొంతంగా 303 సీట్లు సాధించగా, 2024లో 404 సీట్లు సాధిస్తామని చెప్పారు. ఇదేమీ అతిశయోక్తి కాదని, ప్రజలు బీజేపీ అభివృద్ధి అనుకూల రాజకీయాలను ఆదరిస్తున్నారని తెలిపారు. ఈ పరిస్థితుల్లో టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారడం కంటే వీఆర్ఎస్ తీసుకోవడం ఖాయమని చెబుతూ కాంగ్రెస్ పార్టీని ప్రజలు విశ్వసించడం లేదని స్పష్టం చేశారు.
తెలంగాణలోనూ గుజరాత్ సీన్ రిపీట్
గుజరాత్ ఎన్నికల ఫలితాలు ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మాకు నిదర్శనమని బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ తెలిపారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఊహించిన దానికంటే ఎక్కువ స్థానాల్లో బీజేపీ ఘన విజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై స్పందించిన తరుణ్ చుగ్ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కూడా గుజరాత్ సీన్ రిపీట్ అవుతుందని చెప్పారు. తెలంగాణలో బీజేపీ 100 సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబ, అవినీతి పాలనకు చరమగీతం పడుతామని తరుణ్ చుగ్ స్పష్టం చేశారు.
రాష్ట్రంలో టీఆర్ఎస్, బీఆర్ఎస్ మాత్రమే కాదు ఎన్ని పార్టీలు వచ్చినా బీజేపీని ఏమీ చేయలేవని ఆయన ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పాలనపై ప్రజలు విసిగిపోయారని పేర్కొన్నారు. ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆప్ పార్టీకి అహంకారం ఎక్కువైందని ధ్వజమెత్తారు. హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీకి మంచి ఫలితాలే వచ్చాయని, ఆశించిన దానికన్నా ఎక్కువ శాతం ఓట్లు పడ్డాయని తరుణ్ చుగ్ చెప్పారు.