తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు అవకాశం ఇస్తే గడీల పాలన నుండి విముక్తి చేసి పేదోల్ల రాజ్యం తీసుకువస్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ తెలిపారు. కోరుట్ల మండలం యూసుఫ్నగర్ గ్రామం నుండి బండి సంజయ్ 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర శనివారం ప్రారంభమై అయిలాపూర్ చేరుకుంది.
ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి సంజయ్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని తెలిపారు. గ్రామ పంచాయతీలలో చేపట్టే ప్రతి అభివృద్ది పనిలో కేంద్ర ప్రభుత్వ నిధులు ఉన్నాయని, ఏకగ్రీవ గ్రామ పంచాయతీలకు టిఆర్ఎస్ ప్రభుత్వం నయా పైసా ఇవ్వలేదని అని విమర్శించారు.
“బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లారా… మీరెప్పటికీ సీఎం కాలేరు. కొడుకును సీఎం చేసి మిమ్ముల్ని కేసీఆర్ అవమానిస్తరు. అందుకే బీజేపీతో కలిసి రండి… ప్రగతి భవన్ బద్దలు కొడదాం”అని సంజయ్ పిలుపునిచ్చారు. వచ్చే ప్రభుత్వంలో పోలీసులు మొట్టమొదట ఉరికించేది కేసీఆర్ నే అని స్పష్టం చేశారు.
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అసలైన ప్రజా ప్రభుత్వం అని పేర్కొన్నారు. గత సంవత్సర కాలం నుండి గడీల పాలన విముక్తి కోసం మీ కోసం పాదయాత్ర చేస్తున్నానని చెప్పారు. మీరంతా బిజెపి వైపు అడుగులు వేయాలని ప్రజలనుద్దేశించి కోరారు. సంజయ్ సంగ్రామ యాత్ర అయిలాపూర్ కిషన్ రావుపల్లె మీదుగా కోరుట్ల పట్టణం చేరుకుంది.
తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా బీజేపీ అవతరించిందని మాజీ మంత్రి మర్రి శశిధర్రెడ్డి భరోసా వ్యక్తం చేశారు. కేసీఆర్నిరంకుశ, అవినీతి కుటుంబ పాలనపై బండి సంజయ్ సమర శంఖం పూరించారని కొనియాడారు. టీఆర్ఎస్ కుటుంబం చేతిలో బందీ అయిన తెలంగాణను విడిపించేందుకే సంగ్రామ యాత్ర చేస్తున్నట్టు తెలిపారు. అమలుకు నోచుకోలేని హామీలిచ్చిన కేసీఆర్ ప్రజల్ని నిండా ముంచుతున్నారని, రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని పిలుపిచ్చారు.