భారత జోడో యాత్రలో కరోనా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ లేఖ రాశారు. వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తులే భారత్ జోడో యాత్రలో పాల్గొనాలని సూచించారు. యాత్రలో పాల్గొనే వాళ్లంతా మాస్క్లు ధరించేలా, శానిటైజర్లు వాడేలా పర్యవేక్షించాలని కోరారు.
కరోనా కట్టడికి సంబంధించిన నిబంధనలను అమలు చేయాలని కోరారు. ఒకవేళ అది సాధ్యం కాకపోతే.. అత్యవసర ప్రజారోగ్య పరిస్థితుల దృష్ట్యా ప్రస్తుతానికి యాత్రను ఆపేయాలని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర రాజస్థాన్ లో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ లేఖకు సంబంధించిన మరో కాపీని కేంద్ర ఆరోగ్యశాఖ రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కు కూడా పంపింది.
జపాన్, అమెరికా, చైనా, బ్రెజిల్, దక్షిణ కొరియా దేశాల్లో మళ్లీ కరోనా విజృంభిస్తోందనే వార్తల నేపథ్యంలో మంగళవారం రోజున అన్ని రాష్ట్రాలకు కూడా కేంద్ర ఆరోగ్యశాఖ లేఖ రాసింది. కరోనా ముప్పు నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. బుధవారం కేంద్ర మంత్రి ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం జరిపారు.
కాగా, రాహుల్ గాంధీకి కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి లేఖ రాయడంపై కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి మండిపడ్డారు ‘‘బహుశా రాహుల్ గాంధీ పాదయాత్ర చేయడం ఆరోగ్యశాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయకు నచ్చడం లేదనుకుంటా. అందుకే ఇలాంటి లేఖను విడుదల చేశారు. యాత్రపై నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే ఈ ప్రయత్నం చేస్తున్నట్టుండ్రు”అని వ్యాఖ్యానించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ ఎన్నికల ప్రచార సభల్లో కరోనా నిబంధనలను పాటించారా? అని నిలదీశారు