ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తు సిట్ నుంచి సీబీఐకి బదిలీ చేస్తూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.ఈ విచారణ సందర్భంగా సిట్ తరఫున అడ్వొకేట్ జనరల్ వాదనలు వినిపించారు. ఈ దశలో కేసును సీబీఐకి బదిలీ చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని అడ్వొకేట్ జనరల్ తెలిపారు.
ఈ కేసు దర్యాప్తులో సిట్ పురోగతి సాధించిందని, అందుకే సిట్ తోనే దర్యాప్తు కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. బీజేపీ నేతల తరఫున రాంచందర్ రావు వాదనలు వినిపించారు. సిట్ దర్యాప్తులో సాంకేతిక అంశాలను విస్మరించారని ఆరోపించారు.
రాజకీయ దురుద్దేశాలతోనే ఈ కేసు పెట్టారని, కేసుతో సంబంధంలేకపోయినా బీజేపీ పేరు ప్రస్తావించారని ఆయన కోర్టుకు విన్నవించారు.
ఏకంగా ముఖ్యమంత్రి మీడియా సమావేశం ఏర్పాటు చేసి విమర్శలు చేశారని వివరించారు. అసలు ఈ కేసులో ఏసీబీకి తప్ప సిట్ కు విచారణ జరిపే అధికారం లేదని రాంచందర్ రావు స్పష్టం చేశారు. వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం అడ్వొకేట్ జనరల్ వాదనలను తోసిపుచ్చింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు సిట్ ఏ మేరకు దర్యాప్తు చేసిందో, ఆ వివరాలన్నీ సీబీఐకి అందజేయాలని ఆదేశించింది.
సంచలనం సృష్టించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తును ఇప్పటిదాకా సిట్ చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే, సిట్ దర్యాప్తుపై తమకు నమ్మకం లేదంటూ నిందితులతో పాటు, బీజేపీ నేతలు కూడా హైకోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్లపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. కేసును దర్యాప్తు చేస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం.. సిట్ను రద్దు చేసిన న్యాయస్థానం తక్షణమే దాన్ని సీబీఐకి అప్పగించాలని ఆదేశించింది. ప్రస్తుతం ఎమ్మెల్యేల కొనుగోలు కేసును హైదరాబాద్ సీపీ ఆనంద్ నేతృత్వంలోని సిట్ విచారణ చేస్తోంది. ఇప్పుడు ఈ కేసును హైకోర్టుకు అప్పగించడంతో విచారణను తిరిగి మొదటి నుంచి విచారించే అవకాశం ఉంది.