రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం రైతులకు కేసీఆర్ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని, అందుకే కామారెడ్డి మాస్టర్ ప్లాన్ తీసుకొచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ మండిపడ్డారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ కారణంగా తనకు నష్టం జరుగుతుందన్న ఆందోళనతో సదాశివనగర్మండలం అడ్లూర్ఎల్లారెడ్డికి చెందిన రైతు రాములు ఇటీవల ఆత్మహత్య చేసుకోగా, ఆయన కుటుంబాన్ని సంజయ్ శుక్రవారం పరామర్శించారు.
మాస్టర్ప్లాన్కు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళనకు మద్దతు తెలిపి మీడియాతో మాట్లాడారు. అనంతరం రైతులు, పార్టీ శ్రేణులతో కలిసి కలెక్టరేట్ ను ముట్టడించారు. ఈ సందర్భంగా అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రైతులు, బీజేపీ కార్యకర్తలు.. పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. చివరకు పోలీసులు సంజయ్ ని అదుపులోకి తీసుకొని హైదరాబాద్ కు తరలించారు.
అంతకుముందు సంజయ్ మీడియాతో మాట్లాడుతూ ‘‘కేసీఆర్ పాలనలో రైతులు చితికిపోతున్నారు. ఇక్కడి రైతులను పట్టించుకోని కేసీఆర్.. బీఆర్ఎస్ పెట్టి కిసాన్ సర్కార్ తెస్తానని బయలుదేరారు” అని విమర్శించారు. కామారెడ్డి రైతులకు రాష్ట్ర రైతులందరూ మద్దతు తెలుపుతున్నారని చెప్పారు. ‘‘రైతు చనిపోతే ఒకాయన చనిపోయాడట కదా! అంటూ కేటీఆర్ వెటకారంగా మాట్లాడారు. రైతు చనిపోతే చావు కాదా?” అని ప్రశ్నించారు.
కొందరు కలెక్టర్లు రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కలిసి తిరుగుతున్నారని ఆరోపించారు. ఉద్యోగం చేయడం చేతకాకపోతే బీఆర్ఎస్ కండువా కప్పుకొని రాజకీయం చేయాలని మండిపడ్డారు. ‘‘కామారెడ్డి మాస్టర్ప్లాన్కు వ్యతిరేకంగా నెల రోజుల నుంచి రైతులు ఆందోళన చేస్తుంటే కలెక్టర్ ఎందుకు స్పందించలేదు. రైతులతో ఎందుకు చర్చించలేదు. ప్రభుత్వం స్పందించక పోవడంతోనే రాములు ఆత్మహత్య చేసుకున్నాడు” అని ధ్వజమెత్తారు.
కామారెడ్డి డీఎస్పీ రైతుల పట్ల వ్యవహరిస్తున్న తీరు దారుణంగాఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాస్టర్ ప్లాన్తో దాదాపు 4 వేల రైతు కుటుంబాలు రోడ్డున పడ్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల పోరాటానికి అండగా ఉంటామని, మాస్టర్ ప్లాన్ను రద్దు చేసేంత వరకూ ఉద్యమిస్తామని హెచ్చరించారు.
మీడియాతో మాట్లాడిన తర్వాత తాను ఇప్పుడు కలెక్టరేట్ ముట్టడికి వెళ్తున్నానని, సర్కార్ దిగొచ్చే వరకు అక్కడే బైఠాయిస్తానని సంజయ్ ప్రకటించారు. రైతులు, కార్యకర్తలతో కలిసి కలెక్టరేట్ కు బయలుదేరారు. విషయం తెలుసుకున్న పోలీసులు కలెక్టరేట్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అడ్లూర్ రోడ్డులోనే అడ్డుకునేందుకు రోడ్డుపై బారికేడ్లు ఏర్పాటు చేయగా, వాటిని తోసేసి వందలాది మంది కలెక్టరేట్ మెయిన్ గేట్ వద్దకు చేరుకున్నారు.
లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. పలుమార్లు జరిగిన తోపులాటలో కొంతమంది కార్యకర్తలకు గాయాలయ్యాయి. కొందరు సొమ్మసిల్లి కిందపడిపోయారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సంజయ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వెహికల్లోకి ఎక్కించి తరలించే ప్రయత్నం చేస్తుండగా కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో మరోసారి తోపులాట జరిగింది. పోలీసులు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. సంజయ్ ని హైదరాబాద్కు తరలించారు. ఆందోళనలో బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ అరుణతార, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి, కామారెడ్డి నియోజక వర్గ ఇన్చార్జ్ వెంకటరమణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.