దేశంలోని మొత్తం సంపదలో 40 శాతం ఒక్క శాతం బిలియనీర్ల చేతుల్లోనే ఉందని ఓ నివేదిక తెలిపింది. అట్టడుగున ఉన్న సగం మంది జనాభా వద్ద దేశ సంపదలో కేవలం 3 శాతం మాత్రమే ఉందని పేర్కొంది. 2020లో దేశంలో మొత్తం బిలియనీర్ల సంఖ్య 102 కాగా 2022 నాటికి 166కు పెరిగినట్లు నివేదిక వెల్లడించింది.
దావోస్లో జరుగుతున్న ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్’ వార్షిక సమావేశం సందర్భంగా ఆక్స్ఫామ్ సోమవారం ఈ నివేదికను విడుదల చేసింది. సర్వైవల్ ఆఫ్ ది రిచెస్ట్ పేరుతో ఈ నివేదికను రూపొందించింది. భారత్లోని పది మంది ధనవంతులపై 5 శాతం చొప్పున పన్ను విధించడం ద్వారా వచ్చే మొత్తంతో పాఠశాల మానేసిన పిల్లలందరినీ తిరిగి తీసుకురావచ్చని పేర్కొంది.
2017- 2021 మధ్య అసమానంగా పెరిగిన బిలియనీర్ గౌతమ్ అదానీ సంపదపై ఒకసారి విధించే పన్నుతో రూ. 1.79 లక్షల కోట్ల నిధుల్ని సమీకరించవచ్చని, దీంతో దేశంలో ప్రాథమిక పాఠశాలలో 50 లక్షల మంది ఉపాధ్యాయుల నియామకానికి సరిపోతుందని నివేదిక పేర్కొంది. దేశంలోని బిలియనీర్లపై ఒకసారి రెండు శాతం పన్నుతో దేశంలో పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న పిల్లలందరికీ వచ్చే మూడేళ్ల పాటు అందించే పోషకాహారానికి అవసరమైన రూ.40,423 కోట్లు పొందవచ్చు.
దేశంలోని 10 మంది సంపన్న బిలియనీర్లు (రూ.1.37 లక్షల కోట్లు)పై ఒకేసారి 5 శాతం పన్ను విధిస్తే 2022-23 సంవత్సరానికిగానూ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (రూ. 86,200 కోట్లు), ఆయుష్ మంత్రిత్వ శాఖ (రూ. 3,050 కోట్లు) అంచనా వేసిన నిధుల కంటే 1.5 రెట్లు (రూ. 1.37 లక్షల కోట్లు) రావచ్చని పేర్కొంది.
లింగ అసమానతల విషయానికి వస్తే ఒక పురుష కార్మికుడు సంపాదించే ప్రతి రూపాయికి మహిళా కార్మికులు కేవలం 63 పైసలు మాత్రమే పొందుతున్నట్లు నివేదిక వెల్లడించింది. మరోవైపు.. షెడ్యూల్డ్ కులాలు, గ్రామీణ ప్రాంత కార్మికుల సంపాదనల్లో వ్యత్యాసం మరింత ఎక్కువగా ఉంది.
అగ్ర సామాజిక వర్గాలు సంపాదిస్తున్న దానితో పోలిస్తే షెడ్యూల్డ్ కులాలు 55 శాతం మాత్రమే పొందుతున్నాయి. గ్రామీణ ప్రాంత కార్మికులు పట్టణాల్లో వారితో పోలిస్తే 2018- 2019 మధ్య సగం మాత్రమే సంపాదించారు.
కరోనా మహమ్మారి ప్రారంభమైన నాటి నుండి 2022 నవంబరు వరకు దేశంలో బిలియనీర్ల సంపద 121 శాతం పెరిగింది. రోజుకి రూ. 3,608 కోట్ల సంపద చేరినట్లు నివేదిక తెలిపింది. 2021-22లో జిఎస్టి ద్వారా వచ్చిన మొత్తం రూ.14.83 లక్షల కోట్లలో సుమారు 64 శాతం.. దిగువన ఉన్న 50 శాతం జనాభా నుండి రాగా, కేవలం 3 శాతం జిఎస్టి మాత్రమే మొదటి పది మంది బిలియనీర్ల నుంచి వస్తున్నట్లు పేర్కొంది.