జిఒ -1పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పార్టీల రోడ్ షోలు, సభలపై ఆంక్షలు విధిస్తూ తెచ్చిన జిఒ నెంబరు 1ని తాత్కాలికంగా నిలిపివేస్తూ ఇటీవల ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్టే ఇచ్చింది. హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
రహదారులపై బహిరంగ సమావేశాలు నిర్వహించకుండా రాజకీయ పార్టీల గొంతు నొక్కడానికి రాష్ట్ర ప్రభుత్వం జనవరి 2న జిఒ నెంబరు 1 తీసుకొచ్చిందంటూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.
పిటిషనర్ తరపు న్యాయవాది ఎన్.అశ్వనీ కుమార్ వాదనలు వినిపిస్తూ.. ‘స్వాతంత్య్రోద్యమ సమయంలో ర్యాలీలు, బహిరంగ సమావేశాలను అడ్డుకునేందుకు బ్రిటిష్ ప్రభుత్వం 144 సెక్షన్ విధించింది తప్ప.. ఇలాంటి ఉత్తర్వులివ్వలేదు. పోలీసు చట్టం సెక్షన్ 30, 30(ఎ)ని ఆధారంగా చూపుతూ బహిరంగ సమావేశాలను అడ్డుకోవాలని ప్రభుత్వం చూస్తోంది. అరుదైన, ప్రత్యేక పరిస్థితుల్లోనే సమావేశాలకు అనుమతి ఇచ్చే అంశాన్ని పోలీసులు పరిశీలించాలని జిఒ నెంబరు 1లో పేర్కొన్నారు.
నచ్చినవారికి అనుమతి ఇచ్చి, నచ్చనివారికి నిరాకరించాలనే ఇలాంటి షరతు పెట్టారు. పోలీసులను సంతృప్తిపరచాలని షరతు పెట్టడం రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను హరించడమే. రహదారులపై నిర్వహించే సమావేశాలు, ఊరేగింపులు, యాత్రల నియంత్రణకే పోలీసు చట్టం సెక్షన్ 30(2) పోలీసులకు అధికారం కల్పిస్తోంది. ఆ సెక్షన్ను ఆసరాగా చేసుకుని నిషేధం విధిస్తామంటే కుదరదు. బహిరంగ సమావేశాల నియంత్రణ ముసుగులో ప్రభుత్వం పూర్తి నిషేధం విధిస్తోంది. జీవో అమలును నిలుపు చేస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వండి’ అని కోరారు.
ప్రభుత్వం తరఫున ఎజి శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. పిల్ విచారణార్హతపై అభ్యంతరం ఉందన్నారు. ఇరు వైపులా వాదనలు విన్న ధర్మాసనం.. పోలీసు చట్టం సెక్షన్ 30కి విరుద్ధంగా జిఒ నెంబరు 1 ఉందని ప్రాథమికంగా అభిప్రాయపడింది. జిఒ నెంబరు 1 అమలును ఈ నెల 23 వరకు నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. తదుపరి విచారణను ఈనెల 20కి హైకోర్టు వాయిదా వేసింది.