దేవుళ్లను కూడా కేసీఆర్ ప్రభుత్వం వ్యాపారంగా మార్చేస్తున్నదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజమెత్తారు. యాదాద్రిపై రూ. 1,200 కోట్ల పెట్టుబడి పెట్టి రోజుకు కోటి లాభం గడిస్తున్నామని కేటీఆర్ చెప్పడం సిగ్గు చేటని మండిపడ్డారు. నిఖార్సైన హిందువునని చెప్పుకునే కేసీఆర్ హిందూ దేవుళ్లను కించపరుస్తుంటే నోరెందుకు తెరవడం లేదని ప్రశ్నించారు.
యాదాద్రి ఆలయ అభివృద్ధి పేరుతో ఆ చుట్టుపక్కల ఉన్న స్థలాలన్నీ కబ్జా చేసి భూముల రేట్లు పెరిగేలా చేశారని సంజయ్ ఆరోపించారు. ధర్మం గురించి ఎవరైనా ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని, ధార్మిక క్షేత్రాలను వ్యాపారం కోసం అభివృద్ధి చేస్తున్నట్లు నమ్మిస్తే ఆ దేవుడు కూడా క్షమించడని సంజయ్ హెచ్చరించారు.
మరోవైపు నిజాం వారసుడి అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో జరిపించడాన్ని సంజయ్ తీవ్రంగా తప్పుబట్టారు. తెలంగాణ సమాజాన్ని రాచి రంపాన పెట్టి, ముఖ్యంగా మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డ నిజాం నవాబు వారసుడు ఎక్కడో టర్కీలో చనిపోతే ఆయన మృతదేహాన్ని ఇక్కడికి రప్పించి అంత్యక్రియలు చేయిస్తాననడం సిగ్గు చేటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ ప్రజల పట్ల రాక్షసత్వాన్ని ప్రదర్శించి ఎంతో మందిని చంపిన నిజాంపై ఎందుకంత ప్రేమ? అని ప్రశ్నించారు. నిజాం ఆస్తులపై కేసీఆర్ కన్ను పడిందని, అందుకే వాళ్లను పొగుడుతున్నారని ఆరోపించారు. నయీం డైరీ ఆస్తుల కేసు ఎటు పోయిందో చెప్పాలని సంజయ్ ప్రశ్నించారు. నయీం కబ్జా చేసుకున్న ఆస్తులన్నీ కేసీఆర్ కుటుంబం కబ్జా చేసుకుందని ఆరోపించారు. నయీం డైరీ రహస్యాలన్నీ బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
ఇలా ఉండగా, కాలేజీలో తోటి విద్యార్థిపై దాడికి పాల్పడ్డారంటూ తనకుమారుడు భగీరథ్పై కేసు నమోదు చేయడంపట్ల సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాలు తనతో చేయలేక తన కొడుకుపై కేసులు పెట్టి రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎవరూ ఫిర్యాదు చేయకపోయినా సరే ఎప్పుడో జరిగిన ఘటనపై ఇప్పుడు నాన్-బెయిలబుల్ కేసులు పెట్టారని విమర్శించారు.
ఓ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకు భగీరథ్ చేయి చేసుకున్నాడని, ఈ విషయాన్ని దాడికి గురైన విద్యార్థే స్వయంగా ఒప్పుకున్నాడని తెలిపారు. ఇలాంటి ఘటనలు ఏవైనా జరిగితే ముందు విద్యార్థి తల్లిదండ్రులను పిలిచి కౌన్సెలింగ్ చేయాలని, అదేదీ చేయకుండా నేరుగా క్రిమినల్ కేసులు పెట్టడం వెనుక ఉద్దేశం ఏంటో అందరికీ తెలుసని దుయ్యబట్టారు.