త్రిపుర అసెంబ్లీకి ఫిబ్రవరి 16న, మేఘాలయ, నాగాలాండ్ లకు ఫిబ్రవరి 27న పోలింగ్ జరుగుతుందని ఎన్నికల సంఘం బుధవారం ప్రకటించింది. మూడు రాష్ట్రాల్లో ఫలితాలు మార్చి 2న వెల్లడికానున్నాయి. నాగాలాండ్ అసెంబ్లీ పదవీకాలం మార్చి 12న ముగియనుండగా, మేఘాలయ, త్రిపుర అసెంబ్లీల పదవీకాలం వరుసగా మార్చి 15, మార్చి 22న ముగుస్తుంది.
నాగాలాండ్, మేఘాలయలలోఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తామని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. నాగాలాండ్, త్రిపుర, మేఘాలయలలో ఓటర్ల సంఖ్య 62.8 లక్షలుగా ఉంది. మహిళా ఓటర్ల సంఖ్య – 31.47 లక్షలు. మొదటిసారి ఓటర్ల సంఖ్య 1.76 లక్షలు. మూడు రాష్ట్రాల్లో కలిపి 2.23 లక్షల మంది కొత్త ఓటర్లు చేరారు.
17 ఏళ్లు నిండి 18 ఏళ్లు నిండని వారికి ముందస్తుగా నోటీసులు అందజేసే ఏర్పాటు చేశామని, తద్వారా 18 ఏళ్లు నిండిన వెంటనే ఓటరు కార్డు పొంది వారి పేర్లను చేర్చామని ఎన్నికల సంఘం తెలిపింది. మూడు రాష్ట్రాల్లో 9000కు పైగా పోలింగ్ కేంద్రాలు ఉంటాయని వెల్లడించారు.
ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదని, ఈ రాష్ట్రాల్లోనూ హింసను అరికట్టేందుకు కట్టుబడి ఉన్నామని ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. మూడు రాష్ట్రాల్లోనూ మహిళా ఓటర్ల వాటా పెరుగుతోందన్నారు.నాగాలాండ్లో 60 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వాటిలో 12 బిజెపి, 26 ఎన్ పి ఎఫ్, 17 ఎన్ డి పి పి, నాలుగు ఇతరుల ఆధీనంలో ఉన్నాయి.
త్రిపురలో బీజేపీ ప్రభుత్వం ఉంది. నాగాలాండ్లో నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ అధికారంలో ఉంది. నేషనల్ పీపుల్స్ పార్టీ ఈశాన్య రాష్ట్రాలలో జాతీయ పార్టీగా గుర్తింపు పొందిన ఏకైక పార్టీ మరియు మేఘాలయలో ప్రభుత్వాన్ని కలిగి ఉంది. రాబోయే ఎన్నికల్లో త్రిపురలో సిపిఐ, కాంగ్రెస్ రెండు పార్టీలు రాబోయే ఎన్నికల్లో పొత్తులో పోటీ చేయనున్నాయని ప్రకటించాయి.