దేశంలో వచ్చే ఐదేళ్లలో రెండు లక్షల బహుళార్థక వ్యవసాయ పరపతి కేంద్రాలు (పిఎసిఎస్) ఏర్పాటు చేసేందుకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. పటిష్టవంతమైన పాల, మత్స సహకార సంఘాలను వచ్చే ఐదేళ్లలో ఏర్పాటు చేసేందుకు దీనితో వీలేర్పడుతుందని కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రి అనురాగ్ ఠాకూర్ విలేకరులకు తెలిపారు.
దేశంలో సహకార రంగాన్ని అట్టడుగు స్థాయిలోకి విస్తరింపచేయడం, ఇదే క్రమంలో దీని పటిష్టతకు చర్యలు తీసుకుంటారని కేంద్ర మంత్రి వివరించారు. దేశవ్యాప్తంగా ఇప్పటికే 13 కోట్ల మంది రైతులు ప్రాధమిక సహకార సంఘాలతో వివిధ స్థాయిల్లో భాగస్వాములుగా ఉన్నారని తెలిపారు.
ఈ సొసైటీల పరిధిలో వివిధ పథకాలను మరింత వేగవంతంగా అమలు చేసేందుకు వీలేర్పడుతుంది. ప్రభుత్వ సంపూర్ణ ప్రమేయం కల్పించేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. దేశంలో ఇప్పుడు 63000 పిఎసిలు పనిచేస్తున్నాయి. ఇప్పటివరకు పిఎసిలు లేని ప్రతి పంచాయతీలో కొత్త సహకార సంఘాలు ఏర్పాటు అవుతాయి.
ప్రత్యేకించి పాడి, మత్స పరిశ్రమపైనే దృష్టి సారిస్తారు. సహకార సంఘాలలోని రైతులకు ఎప్పటికప్పుడు తగు సమాచారం అందించడం ద్వారా వారి ఆదాయ వనరులు పెరిగేలా చర్యలు తీసుకుంటారు. అంతేకాకుండా సంబంధిత రంగాలలో పెట్టుబడుల విస్తరణ ద్వారా గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి తెలిపారు.
రూ 4800 కోట్ల వైబ్రెంట్ విలేజ్ పథకం
గ్రామాల నుంచి పట్టణాలు, నగరాలకు వలస నివారణ కు ఉద్ధేశించి కేంద్ర ప్రభుత్వం రూ 4800 కోట్లతో వెబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రాంకు ఆమోదం తెలిపింది. గ్రామాల చైతన్యస్ఫూర్తి దిశలో ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు. నాలుగు రాష్ట్రాలు, సరిహద్దు ప్రాంతంలోని కేంద్ర పాలిత ప్రాంతంలోని 19 జిల్లాలకు ఈ కార్యక్రమాన్ని వర్తింపచేస్తారని మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఇప్పటి సరిహద్దు ప్రాంత అభివృద్ధి కార్యక్రమాలతో సంబంధం లేకుండా ఈ కొత్త పథకాన్ని అమలులోకి తీసుకు వస్తారు.
కాగా, సరిహద్దుల భద్రతను పరిగణనలోకి తీసుకుని ఇండో టిబెటన్ బార్డర్ పోలీసు (ఐటిబిటి)లో మరో ఏడు కొత్త బెటాలియన్ల ఏర్పాటు సంబంధిత నిర్ణయానికి కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీనితో ఐటిబిటిలోకి కొత్తగా మరో 9400 మంది జవాన్లు చేరుతారు.