ఆలస్యం చేయకుండా మణిపూర్లో శాంతి స్థాపనకు జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ప్రతిపక్ష నాయకులు విజ్ఞప్తి చేశారు. మణిపూర్ రాష్ట్రం ఎదుర్కొంటున్న అసాధారణ పరిస్థితిని వీలైనంత త్వరగా పరిష్కరించి, తక్షణమే సాధారణ స్థితికి తీసుకురావాలని కోరారు. రెండు రోజుల పాటు మణిపూర్లో పర్యటించిన 21 మంది ఎంపిలతో పాటు ప్రతిపక్ష పార్టీల ఫ్లోర్ లీడర్లు బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి వినతి పత్రం సమర్పించారు.
”గత కొన్ని నెలలుగా మణిపూర్లో పరిస్థితి క్లిష్ట స్థితికి చేరుకుంది. శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆన్లైన్లో వెలువడిన షాకింగ్ వైరల్ వీడియో దేశాన్ని ద్రిగ్భాంతికి గురిచేశాయి. ఈ విషయాన్ని వెంటనే పరిష్కరించడంలో రాష్ట్ర పరిపాలన వ్యవస్థ, పోలీసులు విఫలమయ్యారని స్పష్టంగా తెలుస్తుంది” అంటూ వారు ఆమెకు వివరించారు. విచారణ చేపట్టి నిందితుడిని పట్టుకునేందుకు రెండు నెలలకు పైగా జాప్యం చేయడం సమస్య తీవ్రతను మరింత పెంచిందని పేర్కొంటూ మహిళలపై అఘాయిత్యాలకు సంబంధించిన అనేక కేసుల్లో ఒక ఘటన మాత్రమే వెలుగులోకి వచ్చిందని తెలిపారు
”బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ఇండియా కూటమి పార్టీలకు చెందిన 21 మంది పార్లమెంట్ సభ్యుల ప్రతినిధి బృందం జూలై 29-30 రెండో రోజుల పాటు మణిపూర్లోని హింస ప్రభావిత ప్రాంతాలను సందర్శించి, మణిపూర్ ప్రజలకు సంఘీభావ సందేశాన్ని ఇచ్చి, వాస్తవికతను అంచనా వేసింది. మహిళలు, పిల్లలతో సహా ప్రజలు ఎదుర్కొంటున్న విధ్వంసం, కష్టాలను ఎంపీలు చూశారు” అని వారు వివరించారు.
”హింసాకాండతో మణిపూర్ వినాశకరంగా మారింది. 200 కంటే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు. 500 మందికి పైగా తీవ్ర గాయాలు అయ్యాయి. 5 వేల కంటే ఎక్కువ ఇళ్లు దగ్ధం అయ్యాయి. 60 వేల మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. సహాయక శిబిరాల్లో దుర్భరమైన పరిస్థితుల్లో బాధితులు నివసిస్తున్నారు” అని వారు పేర్కొన్నారు.
చురచంద్పూర్, మోయిరాంగ్, ఇంఫాల్తో సహా మూడు విభిన్న సంఘర్షణ ప్రభావిత ప్రాంతాల్లోని సహాయక శిబిరాలను ప్రతినిధి బృందం సందర్శించింది. అక్కడ బాధితులతో సంభాషించారు. వారి సమస్యలను విన్నారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారుల జీవన పరిస్థితులను ప్రత్యక్షంగా చూశారు. సహాయక శిబిరాల్లో ఉన్న ప్రజలు ఆహారం, సహాయక సామాగ్రి సరిగా లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎంపీలు రాష్ట్రపతికి వివరించారు.
వారు భయం, అభద్రతా స్థితిలో జీవిస్తున్నారని పేర్కొంటూ వారి జీవితాలను పునర్నిర్మించుకోవడానికి సురక్షితమైన, న్యాయమైన పునరావాసం అవసరం అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మూడు నెలల పాటు ఇంటర్నెట్ నిషేధం వివిధ వర్గాల మధ్య అపనమ్మకాన్ని మరింత పెంచిందని, తప్పుడు సమాచారం వ్యాప్తికి అనుమతించిందని వారు ఆమెకు తెలిపారు.
”ఈ సందర్భంలోనే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుండి, ఇండియా కూటమి పార్టీలు ప్రధానమంత్రి నుండి ప్రకటనను డిమాండ్ చేస్తున్నాయి. అత్యంత జాతీయ ప్రాముఖ్యత కలిగిన ఈ అంశంపై వివరణాత్మక, సమగ్ర చర్చ జరగాలని కోరుతున్నాయి. సంబంధిత నిబంధనల ప్రకారం నోటీసులు ఇచ్చినప్పటికీ, ఈ డిమాండ్లు పార్లమెంట్ ఉభయ సభల్లో తిరస్కరణకు గురవుతున్నాయి. ఈ అంశంపై అర్థవంతమైన చర్చ జరగకుండా అడ్డుకుంటున్నారు” అని వారు ఆరోపించారు. ఇకనైనా ఆలస్యం చేయకుండా రాష్ట్రంలో శాంతి సామరస్యాలను నెలకొల్పేందుకు దయతో జోక్యం చేసుకోండని వారు రాష్త్రపతిని అభ్యర్ధించారు.