తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొనే, దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం కేంద్ర మంత్రివర్గం బుధవారం కీలక నిర్ణయాలు తీసుకోవడం పట్ల కేంద్ర మంత్రి, రాష్త్ర బిజెపి అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి హర్షం ప్రకటించారు. ఆంద్ర్హ ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న కృష్ణా జలాల సమస్యను పరిష్కరించాలని నిర్ణయించామని వెల్లడించారు.
కృష్ణా జలాల పంపిణీ ప్రత్యామ్నాయంపై చర్చించామని చెబుతూ కొత్త ట్రిబ్యునల్ కు బాధ్యతలు అప్పగిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ములుగులో సమ్మక్క, సారక్క ట్రైబల్ కేంద్ర గిరిజన యూనివర్శిటీ ఏర్పాటు చేస్తున్నామని, ఇది గిరిజనులకు ఎంతగానో లాభం చేకూరుస్తుందని చెప్పారు.
ఈ యూనివర్శిటీ కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటవుతుందని, గిరిజనులకు ఉన్నత విద్య అభ్యసించడానికి, వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు యూనివర్శిటీ దోహదపడుతుందని వెల్లడించారు. దాదాపు రూ.900 కోట్లతో నిర్మిస్తామని చెబుతూ యూజిసి ద్వారా యూనివర్శిటీ నిర్వహణ కొనసాగుతుందని పేర్కొన్నారు.
త్వరగా పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నామని చెబుతూ ఈ యూనివర్సిటీ ద్వారా గిరిజనుల ఆచార వ్యవహారాలు, సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి తెలియజేస్తామని తెలిపారు.
రైతుల చిరకాల కోరిక మేరకు పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. కరోనా సమయంలో ప్రపంచవ్యాప్తంగా పసుపు ప్రాధాన్యత పెరిగిందని చెబుతూ బోర్డు ద్వారా పసుపు డిమాండ్ పై రీసెర్చ్ చేస్తారని, దాని పెంపును ప్రోత్సహిస్తామని వివరించారు. పసుపు రైతులకు నైపుణ్యశిక్షణ ఇస్తామన్నారు.
దేశీయ అవసరాలను దృష్టిలో పెట్టుకుని మిగతా పసుపును ఇతర దేశాలకు ఎగుమతి చేస్తామని చెప్పారు. పసుపు డిమాండ్ అవసరం మేరకు రైతులను మరింతగా ప్రోత్సహిస్తామని తెలిపారు. పసుపు బోర్డు ద్వారా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ఇందులో పసుపు రైతులు కూడా మెంబర్స్ గా ఉంటారన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు తర్వాత పసుపు సాగు, ఉత్పత్తి, ఎగుమతి, వినియోగాన్ని పెంచుతామని వివరించారు.