ఆంధ్రప్రదేశ్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పుల కుప్పగా మార్చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు గగ్గోలుపెడుతున్న తరుణంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది. కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలు, ప్రాజెక్టుల కోసం విడుదల చేస్తున్న నిధులు, రుణాలను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించి సంక్షేమ పథకాలకు వినియోగిస్తుందనే విమర్శలు కూడా ఉన్నాయి.
వీటన్నింటిపై సమగ్ర వివరాలు అందజేయాలని, ఆ తర్వాతే కొత్త రుణాలకు అనుమతులు ఇస్తామని కేంద్రం చెబుతోంది. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరిట ఏకంగా గవర్నర్నే హామీగా పెడుతూ రూ. 25 వేల కోట్ల వరకు అప్పు చేయడం వివాదాస్పదమైంది.
ఈ అంశంపై న్యాయస్థానాలతో పాటు కేంద్రం కూడా ఆరా తీస్తోంది. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఈ అన్ని అంశాలపై కేంద్రానికి ఓ నివేదికను అందజేసినట్టు తెలిసింది.
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ ప్రధాని మోదీ, హోమ్ మంత్రి అమిత్ షాలను కలిసి, తెలంగాణ ప్రభుత్వ వ్యవహారాలపై నివేదిక ఇచ్చిన కొద్దీ రోజులకే ఏపీ గవర్నర్ కూడా అటువంటి నివేదిక ఇవ్వడం ప్రాధాన్యత సంతరింప చేసుకుంటున్నది. ఈ నివేదికలను కేంద్రమే కోరి తెప్పించుకుందా? అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి.
ఆర్ధిక వ్యవహారాలపై కేంద్ర వివరణ కోరుతున్న రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో కేంద్రమే గవర్నర్ ద్వారా నివేదిక తెప్పించుకున్నట్టు చెబుతున్నారు. కొత్తగా అప్పు చేయడానికి కేంద్రం అనుమతి కోసం ఏపీ ఆర్ధిక మంత్రి, ఆర్ధిక శాఖ కార్యదర్శి వారం రోజులపాటు ఢిల్లీలో మకాం వేసి, ఫలితం లేక తిరిగి వచ్చిన మరుసటి రోజే గవర్నర్ ఈ నివేదిక ఇవ్వడం గమనార్హం.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితులతో పాటు రాజకీయ పరిస్థితులపై కూడా గవర్నర్ నివేదికలో ప్రస్తావించినట్టు తెలిసింది. తాజాగా ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన ప్రతిపాదనల్లో వైఎస్సార్సీపీతో జట్టు కట్టాలని సూచించడం గమనార్హం. ఈ సూచనపై ఇప్పటి వరకు వైఎస్సార్సీపీ స్పందించలేదు. అయితే కేంద్ర ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలనే కొనసాగిస్తోంది.
రాష్ట్ర గవర్నర్తోనూ ఎలాంటి విబేధాలు లేవు. కానీ రుణ పరిమితి వంటి అంశాల్లో వైఎస్సార్సీపీ నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. మరోవైపు ఈ మధ్యనే రాష్ట్ర మంత్రివర్గంలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. అలాగే త్వరలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్రం అన్ని రాష్ట్రాల నుంచి నివేదికలు తప్పించుకుంటుంది.
గతంలో గవర్నర్లు కేంద్ర హోంమంత్రిని కలిసి నివేదికలు అందజేయడం, రాష్ట్రపతిని మర్యాదపూర్వకంగా కలవడం రివాజుగా మారింది. కానీ గత కొన్నాళ్లుగా ఇందుకు భిన్నంగా ఢిల్లీ పర్యటనలో గవర్నర్లు ప్రధానిని కలిసి చర్చలు జరుపుతున్నారు.
ఏపీ గవర్నర్ ఢిల్లీ పర్యటన కూడా ఇందులో భాగమేనని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రధానితో ఏపీ రాజకీయాంశాలు, ఆర్థిక పరిస్థితి, రుణాలపై లోతుగా చర్చించినట్టు తెలిసింది.