కర్ణాటకలో ఇప్పటికే హిజాబ్ ధారణ పెద్ద వివాదంగా మారింది. ఆ తర్వాత దేవాలయ ఉత్సవాలలో ముస్లింలు షాపులు ఏర్పాటు చేసుకోవడంపై నిషేధం విధించారు. హలాల్ అమ్మకాలపై వివాదం చెలరేగింది. తాజాగా ఇప్పుడు ఒక పాఠశాల బైబిల్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి, కొత్త వివాదాన్ని రాజేసింది.
బెంగళూరులోని 105 ఏళ్లుగా నడుస్తున్న క్రైస్తవ మిషనరీ పాఠశాల క్లియరెన్స్ హైస్కూల్ చేసిన చర్య పట్ల హిందుత్వ సంస్థల ఆగ్రహానికి కారణమవుతుంది. ‘తమ పిల్లలు స్కూల్ కు బైబిల్ తీసుకెళ్లడాన్ని అభ్యంతర పెట్టబోము’ అంటూ ఈ పాఠశాల తల్లిదండ్రుల నుంచి అంగీకారాన్ని క్లియరెన్స్ స్కూల్ తీసుకుంటున్న విషయం ఇప్పుడు బయటకు వచ్చింది.
దీనిపై హిందూ జనజాగృతి సమితి రాష్ట్ర అధికార ప్రతినిధి మోహన్ గౌడ మాట్లాడుతూ.. క్రిస్టియన్ కాని విద్యార్థులను సదరు పాఠశాల బలవంతంగా బైబిల్ చదివిస్తోందని ఆరోపించారు. కానీ, క్లియరెన్స్ స్కూల్ తన తీరును సమర్థించుకుంది. తాము బైబిల్ ఆధారిత విద్యా బోధనను అందిస్తున్నట్టు స్పష్టం చేసింది.
గ్రేడ్ 11 అడ్మిషన్ పత్రంలో తల్లిదండ్రుల డిక్లరేషన్ కాలమ్ ను క్లియరెన్స్ స్కూల్ అమలు చేస్తోంది. అందులోనే పిల్లలు స్కూల్ కు బైబిల్ తీసుకెళ్లడానికి అభ్యంతరం లేదంటూ ధ్రువీకరణ తీసుకుంటోంది.