తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొంటామని భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, రాజ్యసభ సభ్యులు డా. కే. లక్ష్మణ్ తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు తీరుపై మండిపడుతూ తెలంగాణలో పేదలకు ఇళ్లు నిర్మించడంలో ముఖ్యమంత్రి విఫలమయ్యారని ఆరోపించారు.
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఇళ్లను మంజూరు చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందించలేకపోయిందని దుయ్యబట్టారు. కేసీఆర్ రైతులను సైతం దగా చేస్తున్నారని, మాయమాటలతో మోసగిస్తున్నారని విమర్శించారు. సొంత రాష్ట్రంలోనే రైతులకు ఏమీ చేయలేకపోయిన వ్యక్తి ఇప్పుడు దేశవ్యాప్త రైతాంగం కోసం పోరాడతానంటూ పార్టీ పేరు మార్చడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
బీఆర్ఎస్ ఒక అట్టర్ ఫ్లాప్ సినిమా అవుతుందని లక్ష్మణ్ జోస్యం చెప్పారు. ఆ పార్టీ వైపు ఒక్కరూ కూడా కన్నెత్తి చూడలేదని స్పష్టం చేశారు. ఇకపోతే తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు బీజేపీ సిద్ధంగా ఉందని తెలిపారు.
అసెంబ్లీ రద్దు చేయడం వరకే సీఎం కేసీఆర్ చేతుల్లో ఉంటుందని, ఎన్నికలు ఎప్పుడు పెట్టాలన్నది కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయిస్తుందని తెలిపారు. కేసీఆర్ కుమార్తె కవిత మద్యం కుంభకోణం కేసు గురించి మాట్లాడుతూ.. అక్రమ సంపాదన లేనప్పుడు దర్యాప్తు సంస్థలకు భయపడాల్సిన పనిలేదని అన్నారు.