ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన పారిశ్రామిక సంస్థలలో ఒకటిగా పేరొందిన అదానీ గ్రూపు అక్కౌంట్స్ మోసాలు, మనీలాండరింగ్ ఆరోపణల్లో చిక్కుకోవడంతో ఈ గ్రూప్ కు భారీగా అప్పులు ఇవ్వడంతో పాటు ఈక్విటీ రూపంలో పెట్టుబడులు సమకూర్చిన బ్యాంక్లు, బీమా సంస్థలు, మ్యూచువల్ ఫండ్లు ఇరకాటంలో పడుతున్నాయి.
అమెరికన్ పరిశోధన సంస్థ హిండెన్బర్గ్ రీసెర్చ్ సంస్థ అదానీ గ్రూప్ అవకతవకలపై విడుదల చేసిన 108 పేజీల నివేదికపై ఆ సంస్థకానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఇప్పటివరకు పెదవి విప్పక పోవడంతో వివిధ రూపాల్లో ఆ గ్రూపునకు వెళ్లిన తమ పొదుపు మొత్తాలు ఎంతవరకు సురక్షితమనే ఆందోళన ప్రజలలో వ్యక్తమవుతోంది.
ప్రభుత్వ రంగ సంస్థ ఎల్ఐసి అదానీ గ్రూపు సంస్థల్లో కొన్ని సంవత్సరాలుగా పెట్టుబడులు పెడుతోంది. అదానీ ఎంటర్ప్రైజెస్లో 2021 జూన్ 30 నాటికి 1.32 శాతం వాటా ఉండగా, 2022 సెప్టెంబర్ 30 నాటికి 4.02 శాతానికి పెరిగింది. అదానీ టోటల్ గ్యాస్లో 2.11 శాతం నుంచి 5.77 శాతానికి పెంచుకుంది.
అదానీ పోర్ట్స్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ పవర్, అంబూజా సిమెంట్, ఎసిసి తదితర అదానీ గ్రూపు కంపెనీల్లో ఎల్ఐసి రూ.80వేల కోట్ల పెట్టుబడులను కలిగి ఉంది. అయితే అదానీ గ్రూప్ పై ఆరోపణలు వెలుగులోకి వచ్చిన తరువాత రెండు రోజుల్లో ఎల్ఐసి రూ.18వేల కోట్ల మేర నష్టాలు చవి చూసింది. మరోవంక, అదానీ ఎంటర్ప్రైజెస్ తాజాగా జారీచేసిన రూ. 20,000 కోట్ల ఎఫ్పిఒలో మరో రూ. 300 కోట్లను పెట్టుబడులుగా పెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
2022 డిసెంబర్ ముగింపు నాటికి దేశంలోని అన్ని మ్యూచువల్ ఫండ్ కంపెనీలు అదానీ కంపెనీల్లో స్థూలంగా రూ.25,263 కోట్ల పెట్టుబడులు పెట్టాయి. ఐసిఐసిఐ, యాక్సిస్, హెచ్డిఎఫ్సి, క్వాంట్. టాటా, యుటిఐ తదితర మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు ఈ మొత్తాన్ని పెట్టుబడులుగా పెట్టాయి. అదానీ గ్రూపులోనిఐదు కంపెనీలకు భారత బ్యాంక్లు రూ.81,200 కోట్ల అప్పులు ఇచ్చాయి.
అదానీ గ్రూపునకు ప్రైవేటు సంస్థల కన్నా ప్రభుత్వ సంస్థలే ఎక్కువ రుణాలు ఇవ్వడంతో పెట్టుబడులు కూడా పెట్టాయని ఇది ఎలా సాధ్యమైందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జై రామ్ రమేష్ ప్రశిుంచారు. కాగా, అదానీ గ్రూపునపై హిండెన్బర్గ్ విడుదల చేసిన రిపోర్టుపై సెబీ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. దశాబ్దాలుగా అదానీ కంపెనీలు అకౌంటింగ్ మోసాలకు, షేర్ల ధరల పెరుగుదలలో అవకతవకలకు పాల్పడుతుందని హిండెన్బర్గ్ ఇచ్చిన రిపోర్టుపై సెబీ నిశితంగా పరిశీలన చేస్తొందని వార్తలు వస్తున్నాయి.