శాసనసభ సమావేశాలను తెలంగాణ ప్రభుత్వం బీఆర్ఎస్ వేదికగా మార్చుకుందని, తండ్రీ (సీఎం కేసీఆర్), కొడుకు (మంత్రి కేటీఆర్), అల్లుడు (మంత్రి హరీష్ రావు) పోటీపడి మరీ ప్రధాని మోదీని విమర్శించారని బీజేపీ ఎంపీ, పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా. కె. లక్ష్మణ్ ధ్వజమెత్తారు. శాసనసభ, మండలిలో ప్రజలకు ఏం చెయ్యాలో అనే దానిపై చర్చించలేదని.. అవు కథలా సభ సాగిందని విమర్శించారు.
ప్రభుత్వ వైపల్యాలను పక్క దారి పట్టించేలా.. సభ వ్యవహారాలను పక్కదారి పట్టించారని ఆరోపించారు. కేంద్ర మంత్రిగా కేసీఆర్ గతంలో ఎన్ని నిధులు తెచ్చారని ప్రశ్నించారు. కరోనా సమయంలో పోరుగు దేశాలు ఆర్థికంగా చితికి పోతే.. భారత్లో ఆర్థిక సంక్షోభం లేకుండా ప్రధాని చేశారని ఆయన కొనియాడారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నేతలు పరస్పరం ప్రశంసించుకున్నారని, ప్రధాని మోదీని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తుంటే బీఆర్ఎస్ నేతలు బల్లలు చరుస్తూ మద్ధతు పలికారని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ వేరు కాదని తాము ఎప్పటి నుంచో చెబుతున్న మాట నిజమని నిరూపితమైందని డా. లక్ష్మణ్ అన్నారు. కాంగ్రెస్ రాసిచ్చిన స్క్రిప్ట్ నే కేసీఆర్ చదివారని ఎద్దేవా చేశారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సభలో చర్చించే ధైర్యం కేసీఆర్ ప్రభుత్వానికి లేదని విమర్శించారు. గుట్టురట్టు అవుతుందని కాగ్ రిపోర్ట్ కూడా పెట్టలేదని ఎద్దేవా చేశారు. తెలంగాణ డిస్కంలను నష్టాల ఊబిలోకి రాష్ట్ర ప్రభుత్వం దింపిందని పేర్కొంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్ల వేరు ఒకటేనని ఎంపీ లక్ష్మణ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ రాసి ఇచ్చిన స్క్రిప్ట్ను తండ్రీ కొడుకులు చదివారని విమర్శించారు. అప్పుల్లో తెలంగాణ రాష్ట్రం పోటీ పడుతోందని పేర్కొన్నారు. సెక్రటేరియట్కు రాని ముఖ్యమంత్రికి, సెక్రటేరియట్ అవసరమా? అని ప్రశ్నించారు.
మరోవైపు బీసీల కులగణన విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు సానుకూలంగా లేదన్న ప్రశ్నకు బదులిస్తూ.. ఇందుకు చాలా అధ్యయనం అవసరమని, దానికి చాలా సమయం పడుతుందని డా. లక్ష్మణ్ తెలిపారు. కుల గణన గురించి ఆరోపణలు చేస్తున్న పార్టీలు ఆయా రాష్ట్రాల్లో ఎందుకు బీసీల కుల గణన చేపట్టడం లేదో చెప్పాలని కోరారు.
బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ డిమాండ్పై బదులిస్తూ బీసీ వర్గాలకు చెందిన నరేంద్ర మోదీయే ప్రధాన మంత్రిగా ఉన్నారని, చరిత్రలో ఎప్పుడూ లేనంతగా కేంద్ర మంత్రివర్గంలో 27 మంది బీసీలకు చోటు కల్పించారని, అలాంటప్పుడు ప్రత్యేక మంత్రిత్వ శాఖ అవసరం ఏముందని ప్రశ్నించారు.