శివరాత్రి సందర్భంగా వైసీపీ విడుదల చేసిన పోస్టర్ పై బీజేపీ నేతలు రగిలిపోతున్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని పేర్కొంటూ అందుకు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
సీఎం జగన్ మోహన్ రెడ్డి పేరుతో వైసీపీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన పోస్టుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. హిందువులకు క్షమాపణలు చెప్పడంతో పాటు, ఆ ట్వీట్ ను వెంటనే డిలీట్ చేయాలనే డిమాండ్ తో ఏపీ బీజేపీకి ఆందోళనలు చేపడుతోంది. ఈ వ్యహారంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
రాష్ట్రంలో హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ వ్యవహరిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మహా శివరాత్రి రోజున శివ భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వైసిపి అఫీషియల్ ట్విట్టర్ లో జగన్ అభ్యంతరకర దుస్తులు ధరించి శివతత్వం గురించి ట్విట్ చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీశారని ధ్వజమెత్తారు.
“అన్నార్తుల ఆకలి తీర్చడమే ఈశ్వరారాధాన” అని పేర్కొంటూ ఆ శివయ్య చల్లని దీవెనలు రాష్ట్ర ప్రజలందరి పై ఉండాలని కోరుకుంటూ శివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అని తెలిపారు. పేద వాళ్ళు అని పేర్కొంటూనే, చేతిలో డమరుకాన్ని చిత్రీకరించిన చర్య హైందవ ధర్మం హిందువుల మనోభావాల పట్ల వైసిపి ప్రభుత్వం చులకన భావానికి ప్రతీక అని బిజెపి నేతలు విమర్శిస్తున్నారు.
హిందువులకు సీఎం జగన్ బహిరంగ క్షమాపణ చెప్పకపోతే రాష్ట్రంలోని శివాలయాల ఎదుట నిరసన దీక్షలు చేస్తామని ప్రభుత్వాన్ని సోమువీర్రాజు హెచ్చరించారు. రాష్ట్రంలో అంతర్వేదిలో రథం దగ్ధం జరిగితే ఇంతవరకు ద్రోహులను శిక్షించలేదని, అలాగే, విజయనగరంలో రాముడు విగ్రహానికి శిరచ్చేదనం జరిగితే ఇప్పటివరకు ఎవరిని అరెస్ట్ చేయలేదని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలోని హిందూ దేవాలయాలను ఆదాయ వనరులుగా రాష్ట్ర దేవాదాయ శాఖ మార్చుకుందని దుయ్యబట్టారు.
మరోవైపు బీజేపీ ఆఫీసులో శివరాత్రి పోస్టింగ్పై బీజేపీ నిరసన వ్యక్తం చేసింది. ప్లకార్డులుతో నిరసనలో పాల్గోన్న ఎంపీ జీవీఎల్ నరసింహారావు శివరాత్రి సందర్భంగా సీఎం జగన్ పెట్టిన పోస్ట్ హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా ఉందని విమర్శించారు.
కాగా, శివరాత్రి పోస్టింగ్ మీద బీజేపీది అనవసర రాద్దాంతం చేస్తోందని మంత్రి బొత్స నారాయణ విమర్శించారు. హిందువుల మనోభావాలు ఏ విధంగా దెబ్బతిన్నాయో బీజేపీ చెప్పాలని నిలదీసేరు. బీజేపీ దిగజారుడు, వక్రీకరణలకు పాల్పడుతోందని ఆరోపించారు.