ఈడీ విచారణను ఎదుర్కొని నిర్దోషిత్వాన్ని కవిత నిరూపించుకోవాలని బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్ హితవు చెప్పారు. ‘‘ఈడీ నోటీసులు జారీ చేసినప్పుడు విచారణకు సహకరిస్తామని కవిత చెప్పారు. కానీ ఇప్పుడు ఆమె చేస్తున్న తప్పించుకునే మార్గాలను ప్రజలు గమనిస్తున్నారు” అని ఆయన హెచ్చరించారు.
తప్పు చేసిన వారు తప్పించుకునే మార్గాలు వెతుకుతారని అంటూ తప్పు చేయనప్పుడు విచారణకు భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. గతంలో అనేకమంది రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రులు కూడా ఈడీ విచారణ ఎదుర్కొన్నారని ఆయన తెలిపారు.
అవినీతి కేసుల మూసివేతలో తెలంగాణ ఏసీబీ నెంబర్ వన్ గా ఉందని లక్ష్మణ్ విమర్శించారు. ఈ విషయాన్ని నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో ఇటీవల విడుదల చేసిన ‘క్రైం ఇండియా’ రిపోర్టులో వెల్లడించిందని పేర్కొన్నారు. రాజకీయ అవసరాల కోసం ఏసీబీ, పోలీసులు, ఇంటెలిజెన్స్ ను వాడుకోవడం బీఆర్ఎస్ సర్కార్కు పరిపాటి అయిందని ఆరోపించారు.
స్పెషల్ ఇన్వెస్ట్ గేషన్ టీం(సిట్) అంటే తెలంగాణలో పర్మినెంట్ పెండింగ్ అని లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. సిట్ దర్యాప్తు ప్రారంభించిన నయీం కేసు, డ్రగ్స్ కేసు, డేటా చోరీ కేసులు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు.
నయీం కేసులో.. నయీం డైరీ, భూముల కబ్జాలు, కిడ్నాపులు, బంగారం అంటూ సిట్ పెద్ద హడావుడి చేసిందని, చివరికి ఆ డైరీ ఎటుపోయిందో తెలియదని ఎద్దేవా చేశారు. డ్రగ్స్ కేసులోనూ అంతే అని విమర్శించారు. కేసీఆర్ సర్కార్ లీకుల సర్కార్ గా మారిపోయిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇంత పెద్ద స్కామ్ జరిగితే కేవలం ఇద్దరు చిన్న పాటి ఉద్యోగులను అరెస్ట్ చేసి, ప్రభుత్వం చేతులు దులుపుకుందని ధ్వజమెత్తారు. ఈ వ్యవహారంలో తెరవెనక ఉన్న పెద్ద తలకాయల బండారం బయటపెట్టాలని స్పష్టం చేశారు.